కొన్నిసార్లు మనకంటే మన పని ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. మనం ఎవరో తెలియక పోయినా మనం ప్రజల్లో నిలిచి పోయే అంత గుర్తింపు వస్తుంది. అర్థం కావట్లేదా? దీనికి ఒక ఉదాహరణ చూద్దామా?

సరళ చౌదరి. ఎంత మందికి తెలుసు ? దాదాపు మెజారిటీ జనాలకి తెలియదు. అదే ” ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నెంబర్ హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే రైలు 2 ప్లాట్ ఫారం మీదికి వస్తుంది” . ఇది ఎంతమందికి గుర్తుంది.

చాలామందికి ఇది చదివేటప్పుడు ఆ ఆనౌన్సర్  గొంతు కూడా గుర్తు వచ్చింది కదా. గుర్తు రావడం ఏంటి? ఇది చదువుతున్నంతసేపు ఆమె వాయిస్ వినపడుతూ ఉంటుంది. అంతలా ప్రాచుర్యం పొందింది ఈ ప్రకటన.

సరళ చౌదరి ఎవరో ఈపాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆవిడ ఈ రైల్వే ప్రకటన వాయిస్ ఆర్టిస్ట్.1982వ సంవత్సరంలో సెంట్రల్ రైల్వే లో ఆనౌన్సర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరిగింది.

చాలామంది వచ్చారు. అలా వెళ్లిన వాళ్లలో సరళ కూడా ఒకరు. అప్పటి జిఎం అయిన అశుతోష్ బెనర్జీ కి సరళ గొంతు నచ్చడంతో ఉద్యోగానికి రికమెండ్ చేశారు.

మొదట నాలుగు సంవత్సరాలు సరళ ఉద్యోగం టెంపరరీ బేసిస్ మీద నడిచింది. 1986 లో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారు.ఒకప్పుడు ఇలా రికార్డర్లు లేకపోవడంతో సరళ ప్రతి అనౌన్స్మెంట్ కి మాట్లాడవలసి వచ్చేది.

అలా ఒక రోజులో ఎన్నో సార్లు ఇలాంటి ఎనౌన్స్మెంట్ లు చదివేది సరళ. తర్వాత ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు రైల్వే శాఖ. దాంతో సరళకు ఎన్ని సార్లు చదివే పని తగ్గింది.

మీకు ఒకటి తెలుసా? సరళ రిటైర్ అయ్యి పన్నెండు సంవత్సరాలయింది. అయినా సరే ఇప్పటికీ రైల్వేలో ఆమె గొంతే వినిపిస్తుంది. అన్ని అనౌన్స్మెంట్లు ఒకటే సారి రికార్డ్ చేసింది సరళ.

ఒకసారి ఎన్నో సంవత్సరాల నుండి ఒకటే గొంతు అలవాటయ్యాక మళ్ళీ మారిస్తే జనాలకు అలవాటు పడడానికి కష్టం అని భావించిన రైల్వే అధికారులు సరళ గొంతే ఇప్పటికి ఉపయోగిస్తున్నారు.

ఆవిడ గొంతు కి ప్రత్యేకత ఉండడంతోపాటు జనాలకి కూడా తెలియని బంధం ఏర్పడింది. ఇప్పుడు అర్థమైందా మనిషి కంటే తను చేసే పనికి ఎక్కువ గుర్తింపు ఉంటుంది అనే విషయం.