Ads
నందమూరి బాలకృష్ణకి టర్నింగ్ పాయింట్ లాంటి సినిమాల్లో ఒకటి సమరసింహా రెడ్డి. ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా మార్కెట్ ని ఇంకా పెంచిన సినిమా ఇది. బాలకృష్ణ కి కూడా హీరోగా మరొక మెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఈ సినిమాలో అంజలా జవేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందించారు. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. విజయేంద్ర ప్రసాద్, బి. గోపాల్ కి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. కానీ ఒక సమయంలో బి.గోపాల్ కి విజయేంద్ర ప్రసాద్ ఎన్ని కథలు చెప్పినా నచ్చేవి కావట.
దాంతో విజయేంద్ర ప్రసాద్ కి చిరాకు వచ్చి బి. గోపాల్ కి కథలు చెప్పడం మానేశారు. బి.గోపాల్ దగ్గర పనిచేసే తోట రామకృష్ణ ఒక అసిస్టెంట్ వెళ్లి విజయేంద్ర ప్రసాద్ ని రిక్వెస్ట్ చేశారు. దాంతో విజయేంద్ర ప్రసాద్ మళ్లీ బి.గోపాల్ దగ్గరికి వచ్చి, “నేను ఎన్ని కథలు చెప్పినా మీకు నచ్చడం లేదు. మీకు అసలు ఎలాంటి ఐడియా ఉంది? మనసులో ఎలాంటి కథ కావాలి అని మీరు అనుకుంటున్నారు? మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి సినిమా చెప్పండి” అని అడిగారట. అందుకు బి.గోపాల్ “గుండమ్మ కథ, దుష్మన్ సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలాంటి కథ కావాలి” అని అడిగారట.
అంటే ఒక ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా చేయాలని బి.గోపాల్ కి కోరిక. దాంతో విజయేంద్ర ప్రసాద్ వారం రోజుల్లో సమరసింహారెడ్డి కథని తయారుచేసుకొని వచ్చారు. ఆ కథను విన్న బి.గోపాల్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాలకృష్ణతో చేయాలి అని నిర్ణయించుకున్నారు. వెంటనే చెన్నైలో ఉన్న బాలకృష్ణ దగ్గరికి వెళ్లి ఈ కథని చెప్పి ఓకే చేయించారు. తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
End of Article