Ads
దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ముని మనవరాలికి స్థానిక కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సాక్షి కథనం ప్రకారం మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లత రామ్గోబిన్ 62 లక్షల ర్యాండ్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 3.32 కోట్ల రూపాయలతో స్థానిక వ్యాపారవేత్త అయిన ఎస్ఆర్ మహారాజ్ ను మోసం చేశారు. దీంతో పాటు ఫోర్జరీకి కూడా పాల్పడినట్లు రుజువు కావడంతో డర్బన్ లోని ఒక కోర్టు సోమవారం లతకు శిక్షను విధించింది.
Video Advertisement
భారతదేశం నుండి ఒక కల్పిత కన్సైన్మెంట్ సృష్టించి దానికి ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పి ఎస్ఆర్ మహారాజ్ నుండి లత 62 లక్షల ర్యాండ్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈ జైలు శిక్ష విధించారు. అంతే కాకుండా సంబంధిత లావాదేవీలో వచ్చిన లాభాల్లో వాటా ఇస్తానని లత హామీ ఇచ్చారు అని మహారాజ్ ఆరోపించారు. దక్షిణాఫ్రికాలో ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఈలా గాంధీకి కూతురు లత.
మూడు కంటైనర్ల లెనిన్ వస్త్రం భారతదేశం నుండి వస్తుంది అని, పెట్టుబడిదారులను నమ్మించేందుకు లత ఇన్ వాయిస్ లను, డాక్యుమెంట్లను సృష్టించారని నేషనల్ ప్రాప్రాసిక్యూటింగ్ అథారిటీ కోర్టుకి తెలిపింది. ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం ఆగస్టు 2015 లో న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ డైరెక్టర్ అయిన ఎస్ఆర్ మహారాజ్ ను లత కలిశారు. ఆ సంస్థ వస్త్ర వ్యాపార రంగంలో కూడా ఉంది.
నెట్ కేర్ అనే హాస్పిటల్ గ్రూప్ కోసం భారతదేశం నుండి 3 కంటెయినర్లలో లెనిన్ వస్త్రం దిగుమతి చేస్తున్నాను అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటి ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ టాక్స్ చెల్లించలేకపోతున్నాను అని, 62 లక్షల ర్యాండ్లను సర్దుబాటు చేస్తే నౌకాశ్రయం నుండి కంటైనర్లు బయటకు వస్తాయని మహారాజ్ కి వివరించారు లత.
తర్వాత డబ్బు చెల్లించడంతో పాటు, వచ్చే లాభాల్లో వాటా ఇస్తానని కూడా ఆయనకు హామీ ఇచ్చారు. మహారాజ్ ని నమ్మించడం కోసం నకిలీ ఇన్ వాయిస్ లను, ఇతర డాక్యుమెంట్లను చూపించారు. లత కుటుంబానికి ఉన్న విశ్వసనీయత కారణంగా, మహారాజ్ ఆ డబ్బులు చెల్లించి లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఈ మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు.
End of Article