తెలంగాణ పై గురి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ !

తెలంగాణ పై గురి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ !

by Jyosthna Devi

Ads

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ గురి పెట్టింది. తాజాగా చోటు చేసుకున్న పవర్ పాలిటిక్స్ వేళ నేరుగా రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తో డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్ పార్టీ విధానం పైన స్పష్టత ఇచ్చారు. విధాన పరమైన నిర్ణయాలు,పార్టీ మేనిఫెస్టో హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. సీడబ్ల్యూసీలో చర్చించి తీసుకొనే నిర్ణయాలు మినహా వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండదని తేల్చేసారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ పార్టీ ఇమేజ్ కు దెబ్బ కాకుండా ఇతర నేతలను రంగంలోకి దించింది. రేవంత్ స్వయంకృతంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Video Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ బీఆర్ఎస్ కు టెన్షన్ పెంచుతోంది. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. ఈ సమయంలో రేవంత్ వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ విధానంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని గుర్తించింది. వెంటనే పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రకటించారు. కాంగ్రెస్ విధానంలోనే ఉచిత విద్యుత్ ఉందని.. రైతులకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసారు. తెలంగాణలోనూ రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందని..వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా పార్టీ వైఖరిలో మార్పు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

 

రేవంత్ రెడ్డి  వ్యాఖ్యల డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి రేవంత్ రెడ్డి జిల్లాకే చెందిన వంశీచంద్ రెడ్డి ను పార్టీ రంగంలోకి దించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ విధానం ఏంటనేది వంశీచంద్ రెడ్డి  వివరించారు. అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంది…ఉంటుందని చెప్పారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వడంతో పాటు, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం అని వివరించారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక పై కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసిందేని రేవంత్ చేసిన సీతక్క సీఎం వ్యాఖ్యల విషయంలో కూడా  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చర్చించి ఎవరికీ నాయకత్వం ఇవ్వాలో నిర్ణయిస్తారని వివరించారు.

 

బిఆర్ఎస్, బిజేపి లు కలిసి పనిచేసినా కాంగ్రెస్ పార్టీ యే అధికారంలోకి రాబోతుందని టీ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ తరువాత ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. తెలంగాణా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తామని కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ప్రకటిస్తున్నారు.  “ఇందిరమ్మ రైతు భరోసా” పధకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్నారు.  వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన “రైతు డిక్లరేషన్”ను యధాతధంగా అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు . ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

 


End of Article

You may also like