భారత్ లో ఎన్నో విభిన్న మతాలు, కులాలు ఉన్నప్పటికీ ఇక్కడి మనుషుల మధ్య నేటికీ భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తూనే ఉంటుంది. అందుకే ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కుల మతాలతో సంబంధం లేకుండా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను భారతీయులందరు అభిమానిస్తూనే ఉంటారు.
కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఇక్కడి ప్రజలకు ఆయన పట్ల అపార గౌరవం ఉంటుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవిత పాఠాలు నేటి యువతకు సదా ఆచరణీయాలు.
అటువంటి మహనీయుడు కాబట్టే.. ఆయన చనిపోయి ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా ప్రజలు ఆయనను స్మరించుకుంటూనే ఉన్నారు. ఆయన పుట్టుకరీత్యా ముస్లిం అయినప్పటికి… హిందూ.. ముస్లిం తేడా లేకుండా ఆయనను స్మరించుకుంటూ.. ఆయన చెప్పిన జీవిత పాఠాలను ఆచరించుకుంటూ ఉంటారు భారతీయులు. భారత దేశంలోని ఓ హిందూ దేవాలయంలో దేవతా శిల్పాల మధ్య ఏకంగా ఆయన శిల్పాన్నే చెక్కారు. ఆయన ముస్లిం అన్న సంగతి పక్కన పెడితే.. ఓ మంచి వ్యక్తిగా ఆయన భారతీయుల గుండెల్లో నిలిచిపోయారు.
ఇంతకీ ఆ దేవాలయం ఏదో కాదు. తమిళనాడులోని రామేశ్వరం దేవాలయంలో ఆయన విగ్రహాన్ని చెక్కారు. దేశంలో పలు చోట్ల అబ్దుల్ కలాం విగ్రహాలు ఉన్నప్పటికీ.. ఓ దేవాలయంలో ఇలా చెక్కడం మాత్రం ఇదే తొలిసారి. చాలా మంది ప్రముఖులకు దేశంలో పలు చోట్ల విగ్రహాలు కట్టి ఆరాధించడం చూస్తూనే ఉంటాం. కానీ..ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసే భారత దేశంలో ఓ దేవాలయంలో ఇలా విగ్రహాన్ని కట్టించుకున్న ఘనత కలాం గారికే చెల్లింది.


