Ads
టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ఆర్ధిక, అనారోగ్య పరిస్థితులు, అవసరాలు ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆరోగ్యం బాగోలేదని వైద్య ఖర్చులకు డబ్బులివ్వమంటూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద జంటను మోసం చేశారు సైబర్ నేరగాళ్ళు.
Video Advertisement
సోషల్ మీడియా వేదికగా దాతల ఎవరైనా ఉంటే ఆర్ధికసాయం చేసి బిడ్డ ప్రాణాలు నిలబెట్టమని కోరిన జంటకు డబ్బు దానం చేస్తామని మాయమాటలు చెప్పి వాళ్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు కాజేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లికి చెందిన భాస్కర్ దంపతులకు నాలుగు నెలల కొడుకు ఉన్నాడు.
మేఘనాథ్ అనే బాలుడు లివర్ ఇన్ ఫెక్షన్తో బాధపడుతున్నాడు. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని లివర్ ప్లాంటేషన్ చేయాలని తెలిపారు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని వైద్యులు చెప్పారు. కనీసం 18లక్షలు సిద్ధం చేసుకోమని భాస్కర్ దంపతులకు సూచించారు. లక్షలు ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోసం సోషల్ మీడియాలో తమ పరిస్థితి వివరిస్తూ పోస్ట్ పెట్టారు.
అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న దంపతులను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. మూడ్రోజుల క్రితం బాలుడి తండ్రికి ఫోన్ చేసి తాము సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. డబ్బులు వేయడానికి బ్యాంక్ అకౌంట్ చెప్పమన్నారు. వివరాలు తెలుసుకున్న తర్వాత ఓటీపీ, ఏటీఎం కార్డు నెంబర్ అడిగి తెలుసుకున్నారు.
ఇది జరిగిన క్షణాల వ్యవధిలోనే బాధితుడు భాస్కర్ బ్యాంక్ ఖాతాలో ఉండాల్సిన 14 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేయమని.. పోయిన డబ్బు తిరిగి వచ్చేలా చూడమని పోలీసులను వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్ని పట్టుకుంటామని.. డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
End of Article