కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మహిళ చనిపోలేదు..!

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మహిళ చనిపోలేదు..!

by Anudeep

ఇదిగో తోక అంటే అదిగో పులి అని సామెత మాదిరిగా తయారయింది డిజిటల్ మీడియా.. కనపడని కాంపిటీషన్ తో  విచ్చలవిడిగా పెరిగిపోయిన డిజిటల్ మీడియా సంస్థలన్ని  నానా తంటాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జనాల్లో గుర్తింపు పొందాలని ఒక వార్త దొరకగానే ఎవరికి తోచినట్టు వాళ్లు ఎడాపెడా రాసి పడేస్తున్నారు. ఇటీవల ఎలీసా గ్రనాటో మరణించిందని చాలా వార్తలొచ్చాయి..ఇంతకీ ఎవరా ఎలీసా గ్రనాటో? ఆవిడ చనిపోయిందనే వార్తల వెనుక కథ ఏంటి?

Video Advertisement

UKకి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు  కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్దం చేశారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను రూపొందించి మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని వారు అంటున్నారు. వ్యాక్సిన్‌ను మానవులపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు పొందారు.  వ్యాక్సిన్ ప్రయోగానికి ఆసక్తి ఉన్నవాళ్లు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు..అందులో భాగంగా 800మంది ముందుకు రాగా, వారిలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి  మైక్రోబయాలజిస్ట్ ఎలీసా గ్రనాటో.

 

అయితే గత రెండు రోజులుగా  ఎలీసా గ్రనాటో మరణించిందని విపరీతంగా వార్తలొచ్చాయి . ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా నిజమేంటో తెలుసుకోకుండా వ్యాక్సిన్ వికటించడం వలన, వ్యాక్సిన్ తీసుకున్న రెండో రోజే ఆమె మరణించిందని వార్తలు ప్రచురించాయి.ఇదిలా ఉండగా  బీబీసీ జర్నలిస్టు ఒకరు ఈ విషయంపై ఆరా తీసి, అందులో నిజమెంతో కనుక్కుని అది ఫేక్ న్యూస్ అని ప్రకటించారు.

“ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించడం లేదు. కాని నాతో మాట్లాడారు. తన పై వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని ఆమె చెప్పారు” అని బీబీసీ మెడికల్ జర్నలిస్టు ఫెర్గుస్ వాల్ష్ ఒక ట్వీట్‌లో చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. వ్యాక్సిన్ పని తీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారని.. ఆమెతో పాటు మరి కొందరు వాలంటీర్లు కూడా ల్యాబ్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవతున్న నేపధ్యంలో ఆమె తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు, అంతే కాదు బిబిసికి ఒక వీడియో పంపారు.  ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.


You may also like