ఆస్ట్రేలియా లో నివసిస్తున్న తెలుగు వారి కల సాకారం అయ్యింది. హిందీ, పంజాబీ, తమిళం భాషలకు అక్కడి NAATI (National Accreditation Authority for Translators and Interpreters) గుర్తింపు ఉండగా ఇప్పుడు మన తెలుగు భాషకు కూడా NAATI గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA – Federation of Telugu Associations in Australia) 2014 లో తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తించాలని FTAA సంస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి (OAM – కాన్బెర్రా) గారు స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పత్రాన్ని సమర్పించడం జరిగింది.

అయితే అప్పుడు ప్రభుత్వ గణంకాల లెక్కల ప్రకారం తెలుగు వారి జనాభా తక్కువగా ఉండడం వలన ఆ విజ్ఞాపనను తిరస్కరించడం జరిగింది.అయితే తెలుగు మాట్లడేవారందరూ తమ మాతృ భాషగా తెలుగును నమోదు చేయాలని ఉధృతమైన ప్రచారం చేయడం ద్వారా ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కమ్యూనిటీ భాష గ గుర్తింపు లభించింది. అనధికార లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారు ఆస్ట్రేలియాలో 80,000 కి పైగా ఉంటారని అంచనా. వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక గణాంకాల లో అందరూ అవకాశాన్ని అందిపుచ్చుకొని “తెలుగు” మాతృ భాషగా నమోదు చేసుకోవాలని మరోసారి అక్కడి తెలుగు ప్రతినిధులు తెలియజేశారు. దీని వలన భావితరాలకు తెలుగు నేర్పించడం సులభం అవుతుందని అన్నారు. మరియు స్థానిక పాఠశాలల్లో ఆప్షనల్ గ తెలుగు భాష నేర్చుకొనే వీలు కలుగుతుంది. మరియు శాశ్వత నివాస దరఖాస్తులో 5 పాయింట్లు ప్రామాణికం కానున్నాయి. గత కొన్నేళ్లుగా NAATI తో FTAA సభ్యులు సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియలో భాగస్తులై విజయం సాధించారు. కృషి చేసిన వారిలో డా. కృష్ణ నడింపల్లి (కాన్బెర్రా), శ్రీ శివ శంకర్ పెద్దిభొట్ల (సిడ్నీ), మల్లికేశ్వర్ రావు కొంచాడ (మెల్బోర్న్) మరియు తెలంగాణ వాసి వరంగల్ జిల్లా, పరకాల మండలం, రామకృష్ణ పురం వాసి ఆది రెడ్డి యార (అడిలైడ్) గారున్నారు. ఇది ఎన్నో ఏళ్ల కృషి ఫలితం మరియు తెలుగు భాషకు దక్కిన గౌరవం అని ఆది రెడ్డి యార అన్నారు.

డా. కృష్ణ నడింపల్లి (కాన్బెర్రా)

ఆది రెడ్డి యార (అడిలైడ్)

శ్రీ శివ శంకర్ పెద్దిభొట్ల (సిడ్నీ)

మల్లికేశ్వర్ రావు కొంచాడ (మెల్బోర్న్)
