రేవంత్ రెడ్డి ఆఫర్ కి DSP నళిని బహిరంగ లేఖ..! ఏం అన్నారంటే..?

రేవంత్ రెడ్డి ఆఫర్ కి DSP నళిని బహిరంగ లేఖ..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

డీఎస్పీ నళిని, 2012 తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలనం సృష్టించిన పేరు.  తెలంగాణ కోసం ఆమె డిఎస్పి  ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసారు. తెలంగాణ కల సాకారం అయిన తరువాత ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. అలాగే ఈ 12 ఏళ్ళలో ఆమె తన ఉద్యోగాన్ని కావాలని అనుకోలేదు.

Video Advertisement

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆమె పేరు మళ్ళీ వినిపించింది. ఆమెను తిరిగి జాబ్ లోకి తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా నళిని పేరే వినిపిస్తోంది. 2012లో తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్ర అంశం పై అప్పటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డీఎస్పీ నళిని సుమారు పన్నెండేళ్ల క్రితం తన పోస్ట్ కు రాజీనామా చేసారు.
డీఎస్పీ నళిని తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసేవారి పై లాఠీ ఎత్తలేను అంటూ తన ఉద్యోగాన్ని వదిలేసింది. మేర వర్గానికి చెందిన నళినికి వివాహం జరిగి, అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఢిల్లీలో సైతం దీక్షలు చేసింది. రాజీనామా చేసిన తరువాత ఆమె కనిపించలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో నళినిని తిరిగి జాబ్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ సామజిక మధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యోగానికి రిజైన్ చేసిన నళినికి డీఎస్పీ పోస్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే విధులకి తీసుకోవాలని సీ.ఎస్ మరియు డీజీపీలను ఆదేశించారు.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశం పై నళిని సోషల్ మీడియాలో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ” గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుంది.ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘ సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను.నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి.

ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్స్ రాయమనడం, ఆన్యువల్ కాన్ఫిడెన్సియల్ రిపోర్ట్స్ లో అడ్వర్స్( చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్ లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు.నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు.ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయక పోగా, నన్ను ఎగతాళి చేశారు.
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ర్ట దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హై లైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది.

సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నా లోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారు.ఈ నాడు 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత తెలంగాణా మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును మళ్ళీ వెలికితీసారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది.
ఉద్యమములో నేను నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. ఏకాంతవాసం అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు,కుటుంబం,ఆరోగ్యం,మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.జీవచ్చవం లా బతికాను. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.

జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు.ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను.వేద ప్రచారకురాలిగా,వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతి తో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చు.కాబట్టి నా పంథా మర్చుకొలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను.ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసి కి వెచ్చించలేను.శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను.
అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు.నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్య ను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి.
నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి.మీలో మంచి స్పార్క్ ఉంది.మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ , సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది)” అంటూ రాసుకొచ్చారు.

Also Read:ఎవరు ఈ శాంభవి..? 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది..?<


End of Article

You may also like