గాడ్ ఫాదర్’ ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకుడు మోహన్ రాజా తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ‘లూసిఫర్’లో లేని 10 సర్ప్రైజ్లను ‘గాడ్ ఫాదర్’లో ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు. అందుకే, ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘హనుమాన్ జంక్షన్’తో టాలీవుడ్కు పరిచయమైన మోహన్ రాజా.. ఆ తరవాత ఆయన మళ్లీ చేస్తున్న తెలుగు సినిమా ఇదే. మలయాళ ‘లూసిఫర్’ నుంచి కథ మాత్రమే తీసుకున్నామని.. కథనం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Video Advertisement
“తని ఒరువన్’ నుంచి చరణ్తో నాకు పరిచయం ఏర్పడింది. ‘ధృవ-2’ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫర్’ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా నా పేరుని ఎన్వీ ప్రసాద్ సూచించారు. చరణ్, చిరంజీవి గారికి నచ్చి.. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే ‘లూసిఫర్’ చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవి గారికి చాలా నచ్చింది.
కథను మార్చకుండా ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ‘గాడ్ ఫాదర్’ స్క్రీన్ ప్లే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా ప్రేక్షకుల మనసులు గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి.
2 గంటల 50 నిమిషాల నిడివి ఉన్న ‘లూసిఫర్’లో మోహన్ లాల్ 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి 2 గంటల పాటు కనిపిస్తారు. చిరంజీవి కనిపించని సీన్స్లో కూడా ఆయన ప్రజన్స్ ఉంటుంది. దీని ప్రకారం ఎలాంటి మార్పులు చేశామో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ‘గాడ్ ఫాదర్’కి నేను రాసుకున్న స్క్రీన్ ప్లే ఎక్కడా నెమ్మదించదు. ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి ఇమేజ్కి తగ్గ కథ.” అని దర్శకుడు మోహన్ రాజా తెలిపారు.
అయితే దర్శకుడు చెప్పిన ఈ మార్పులు ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి ప్లస్ అవుతాయో.. మైనస్ అవుతాయో చూడాలి..