టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (13న) మెల్బోర్న్లో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోను, ఆ తర్వాత సూపర్-12 దశలోను కొన్ని మ్యాచ్లను తుడిచిపెట్టేసిన వరుణుడు ఫైనల్ మ్యాచ్కు కూడా అడ్డుతగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరగనున్న మెల్బోర్న్లో ఆదివారం వర్షం పడే అవకాశాలు 100 శాతం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది.
Video Advertisement
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడితే రిజర్వు డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే, సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు 95 శాతం వరకు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మెల్బోర్న్లో జరగనున్న ఈ మ్యాచ్కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా కూడా మ్యాచ్ కొనసాగించేందుకు వీలుగా మార్పులు చేశారు. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉన్నప్పటికీ సోమవారం కూడా వర్ష సూచన ఉండడంతో అదనంగా మరో 2 గంటల సమయాన్ని రిజర్వ్లో పెట్టుకున్నారు నిర్వాహకులు.
రిజర్వ్ డే ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయం రెండు గంటలు అదనంగా పెంచినప్పటికీ కూడా వర్షం అంతరాయం కలిగించి ఒక్కో జట్టు 10 ఓవర్ల కంటే తక్కువ ఆడాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడు ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం కనుక పూర్తికాకుంటే రిజర్వ్ డే అయిన సోమవారం కొనసాగుతుంది. అంటే సోమవారం మళ్లీ రెండు జట్ల మధ్య కొత్తగా ఆట మొదలు కాకుండా ఆదివారం నాటి ఆటను సోమవారం కొనసాగిస్తారు. ముందురోజు ఆదివారం ఎన్ని ఓవర్లకు ఆట నిర్ణయమైతే రెండో రోజు ఆటనూ ఆ లెక్కనే కొనసాగిస్తారు. అంటే తొలిరోజే ఆటను 10 ఓవర్లకు కుదిస్తే రెండో రోజుకూడా అదే లెక్కన మ్యాచ్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్కు అదనంగా 2 గంటలు కేటాయించడం అంటే సోమవారం రిజర్వ్ డేతో కలిపి మొత్తం 7 గంటల 10 నిమిషాలు అదనంగా ఉన్నట్లు.
అక్టోబరు, నవంబరులో ఆస్ట్రేలియాలో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. మెల్బోర్న్లో వర్షం కారణంగా మూడు సూపర్-12 మ్యాచ్లు రద్దయ్యాయి. వాటిలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్లు రద్దయ్యాయి. ఇంగ్లండ్-ఐర్లాండ్ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించినా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విజయం సాధించింది.