Ads
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో తమ ఆత్మీయులను పోగొట్టుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు మృతి చెందడంతో చాలా కుటుంబాలు అవస్థలు ఎదుర్కొన్నాయి. కొంతమంది బిడ్డలను పోగొట్టుకుంటే..మరికొందరు తల్లి తండ్రులను పోగొట్టుకున్నారు.
Video Advertisement
తాజాగా.. ఓ మహిళ తన భర్తని పోగొట్టుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అతను మరణించడంతో ఇంట్లోని వారందరు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె పరిస్థితి వర్ణనాతీతం.
భర్త లేడు అన్న బాధని ఆమె భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. భర్తలేని జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్య ప్రయత్నం చేయబోగా ఆమెను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. భర్త స్నేహితుడు ఆమెకు అండగా నిలవాలని అనుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని అందించాలని భావించాడు.
వివరాల్లోకి వెళితే, కర్ణాటక బెంగళూరు కు చెందిన చేతన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ వేవ్ సమయంలో అతను కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మృతి చెందాడు. చేతన్ మరణంతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయింది. చేతన్ భార్య అంబిక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ సమయంలోనే చేతన్ స్నేహితుడు అంబికను వారించి కుటుంబానికి అండగా నిలిచాడు.
ఆమెను పెళ్ళిచేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లితండ్రులకు తెలిపాడు. అతని తల్లి తండ్రులు కూడా అందుకు అంగీకరించి అంబిక తల్లి తండ్రులతో కూడా మాట్లాడారు. వారు కూడా అంగీకరించి ఇరువురికి పెళ్లి జరిపించారు. జనవరి 27న చామరాజనగర్లోని శివయోగి మఠంలో వీరిద్దరికి పెళ్లి జరిగింది. ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చాలించాలనుకున్న ఆ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వడంపై ఆ స్నేహితుడిని అందరు అభినందిస్తున్నారు.
End of Article