విక్టరీ వెంకటేష్ … సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. చాలా గొప్ప నటుడు. అంతే కాదు సంపూర్ణ నటుడు కూడా.ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విశ్వరూపం చూపిస్తాడు. స్టార్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య కెరీర్ లో ఎదో ఒక సందర్భం లో గ్యాప్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్లే.. కానీ వెంకటేష్ మాత్రం అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికి తెలుగు వారికి ఫేవరేట్ హీరోనే.. ఆయన కెరీర్ మొదటి నుంచి బ్రేక్స్ లేకుండా సాగుతూనే ఉంది.
Video Advertisement
36 ఏళ్ళ క్రితం వచ్చిన కలియుగ పాండవులు నుంచి F3 వరకు వెంకటేష్ వెనుదిగిరి చూసుకోలేదు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసినా…తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. అయితే వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వెనుక ఒక కథ ఉంది.
సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను వేరే ఇతరత్ర కారణాలతో చేయకపోవడం.. ఆ సినిమాను వేరే హీరోకు కలిసి రావడం ఎప్పటి నుంచో ఉంది. అలా సూపర్ స్టార్ కృష్ణ చేయకుండా పోయిన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి వెంకటేష్ వంటి హీరో దొరికారు. వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులను మొదట కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణతో చేయాలనుకున్నారు రామా నాయుడు.
ఈ విషయమై కృష్ణతో మాట్లాడగా.. ఈ సినిమాను చేస్తాను కానీ.. దీనికి సహ నిర్మాతగా తన బంధువును తీసుకోవాలని రామానాయుడుకు సూచించారట. దీనికి రామానాయుడు ఒప్పులేదు. అమెరికాలో చదువుతున్న తన చిన్న కుమారుడు వెంకటేష్ ను ఉన్నపళం గా రప్పించి.. నెల రోజులు నటనలో శిక్షణ ఇప్పించి ఈ చిత్రాన్ని తీశారు రామా నాయుడు.
ఈ సినిమాలో కుష్బూను హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేసారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం సమకూర్చారు. 1986లో ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఐతే.. ఈ మూవీ తర్వాత హీరోగా వెంకటేష్ వెనుదిరిగి చూసుకోలేదు. అలా సూపర్ స్టార్ కృష్ణ గారు చెయ్యాల్సిన సినిమా మిస్ అయ్యి వెంకటేష్ ని హీరో చేసిందన్నమాట..