ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైనా సంగతి తెలిసిందే. సిసి టీవీ ఏర్పాటు ఉన్న వారి ఇంట్లో సంగతులు ఎలా ఉన్నా…తాళాలు వేసిన వారి ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన స్థానికం గా కలకలం రేపుతోంది. తలుపులు వేసి ఓ ఇంట్లోని వ్యక్తి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరచి ఉండడాన్ని చూసి ఖంగు తిన్నాడు.

ఇంటి లోపలకి వెళ్లే సరికి టివి ఆన్ చేసి ఉంది. వెంటనే ఇంట్లోంచి ఓ ఇద్దరు మహిళలు వచ్చి.. ఏంటి ఇంట్లోకి వచ్చేస్తున్నావు..? ఎవరు మీరు? అడక్కుండా వచ్చేయడమేనా..? ఎందుకొచ్చారు..? అంటూ వరుస పెట్టి ప్రశ్నలతో దబాయించేసారు. దీనితో సదరు వ్యక్తి కి పిచ్చి కోపం వచ్చింది. అసలు నా ఇంట్లోకి నేను వస్తే.. అడగడానికి మీరెవరు అంటూ మండిపడ్డాడు. దీనితో, ఆ ఆడవాళ్లు ఇద్దరు కలిసి ఈ వ్యక్తిని లోపలకు లాగడానికి ప్రయత్నించగా.. సదరు వ్యక్తి విడిపించుకుని బయటకు వచ్చి.. చుట్టు పక్కల వారిని పోగేసాడు. న్యూస్ 18 కథనం ప్రకారం అతని పేరు పచ్చిపాల కోటేశ్వరరావు. కృష్ణా జిల్లా కంకిపాడు బస్టాండ్ కు దగ్గరలో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కోటేశ్వరావు పని ఉండి తలుపులు వేసి బయటకు వెళ్లగా.. తిరిగి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది.

బయట ఉన్న స్థానికులు కూడా అక్కడ పోగు అయ్యి ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ విజయవాడ మార్చవరానికి చెందిన అత్తాకోడళ్ళట. వారి పేర్లు బోయపాటి ధనలక్ష్మి, సాత్విత అని తేలింది. వారిద్దరూ దొంగతనాలనే తమ వృత్తి గా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె, సాత్విత నెలరోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. వారు ఆ స్థలానికి బిడ్డతో సహా వచ్చారు. బిడ్డ డైపర్ లో కూడా బంగారు ఆభరణాలు ఉండడం చూసిన స్థానికులు షాక్ అయ్యారు. వీరు ఇళ్లలోకి వెళ్లి, టీవీ ఆన్ చేసి మరీ దొంగతనాలు చేస్తుంటారు. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
