Home Human angle ఏడుగురు ఆడపిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలే.. ఒక తండ్రి స్ఫూర్తిదాయక కథ!

ఏడుగురు ఆడపిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలే.. ఒక తండ్రి స్ఫూర్తిదాయక కథ!

by Sainath Gopi

సమాజం ఎంత ముందుకు వెళుతున్నప్పటికీ తల్లిదండ్రులకి మగ పిల్లల మీద ఆశ చావటం లేదు. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా పర్వాలేదు కానీ ఒక్క మగపిల్లాడు ఉంటే జన్మ ధన్యమైపోతుంది అనుకునే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ల కళ్ళముందే ఆడవాళ్లు ఎన్నో విజయాలను సాధిస్తూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఎందుకో తల్లిదండ్రుల దృష్టిలో ఆడపిల్ల వెనకనే ఉంటుంది. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టేసరికి అమ్మో ఆడపిల్లల అంటూ సానుభూతి చూపించడం ప్రారంభిస్తారు. అయితే అందరి తల్లిదండ్రులు అలా ఉండకపోవచ్చు కానీ కొందరు మాత్రం ఒక మగపిల్లాడి కోసం ఎంతమంది ఆడపిల్లలనైనా కనటానికి వెనకాడటం లేదు.

అలాంటి ఒక తండ్రి కధే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. బీహార్ లోని సరన్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ సింగ్ పిండి మిల్లి కార్మికుడు. ఈయన కూడా అందరిలాగా తనకి వారసుడు పుట్టాలని కలలు కన్నాడు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి వచ్చిందనుకున్నాడు, ఆ తర్వాత వరుసగా ఆరుగురు ఆడపిల్లలే పుట్టారు. ఏడుగురు ఆడపిల్లల్ని కన్న రాజకుమార్ సింగ్ ఆడపిల్లలని భయపడలేదు, ఒక వయసు వచ్చాక ఒక అయ్య చేతిలో పెట్టేసి చేతులు దులిపెసుకుందాం అనుకోలేదు.

అందరినీ శివంగుల్లాగా పెంచాలనుకున్నాడు. తన తాహతకు మించి ఏడుగురిని ఉన్నత చదువులు చదివించాడు. చుట్టుపక్కల వాళ్ళు సింగ్ కూతుర్ల పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కూతుళ్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా పెంచితే చాలు అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని కూతుర్లు నిజమయ్యేలాగా చేశారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆ తండ్రి గౌరవాన్ని నిలబెట్టారు. పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది .

రెండవ కుమార్తె హనీ ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తుంది. మూడవ కుమార్తె సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్, ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్. ఇప్పుడు రాజ్ కుమార్ సింగ్ ఇరుగుపొరుగువారు అతనిని ఆదర్శంగా తీసుకొని వారి ఆడబిడ్డలను కూడా ఉన్నత చదువులు చదివించే దిశగా అడుగులు వేస్తున్నారు.

You may also like