Ads
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక నటించిన వారసుడు చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ మూవీ తమిళంలో బాగానే కలెక్షన్లను సాధిస్తున్నా తెలుగులో మాత్రం ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, శరత్కుమార్, జయసుధ, యోగి బాబు తదితరులు నటించారు.
Video Advertisement
దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. తెలుగులోనూ విజయ్ కి ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మరోవైపు తాను చెప్పిన బడ్జెట్లో సినిమాలు చేయలేడని పేరున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. వారిసు విషయంలోనూ అదే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే వారిసు మూవీకి రూ.30 కోట్లు ఎక్కువ ఖర్చయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. మరో 45-50 రోజులు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది.
వంశీతో గతంలోనూ సినిమాలు తీసిన దిల్ రాజు అతనిపై నమ్మకంతో బడ్జెట్ ఎక్కువైనా వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.150 కోట్లు రావడం విశేషం. ఇందులో శాటిలైట్, డిజిటల్, ఆడియో, డబ్బింగ్ హక్కులు ఉన్నాయి. సినిమా థియేట్రికల్ హక్కులను కూడా రూ.139 కోట్లకు అమ్ముకున్నారు. ఇక డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులు సన్ టీవీ చేతికి దక్కాయి.
ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో కట్ చేసిన సీన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని సమాచారం. అందులో హీరోయిన్ ఖుష్బూతో ఉన్న సీన్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. దాదాపుగా 20 నిమిషాల నిడివి ఉన్న సీన్లు కట్ చేశారని.. దీనివల్ల 10 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ఎక్కువ సీన్లను షూట్ చేయడం వల్ల నష్టం కలిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసిన దిల్ రాజు ఇప్పుడు భారీ చిత్రాలపై మొగ్గు చూపుతున్నారు. అలాగే దిల్ రాజు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసారని తెలుస్తోంది.
End of Article