తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించింది. ఈ రోజు శాసనసభలో తొలి సమావేశం జరిగింది. శాసనసభలో ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం చేసారు. ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసారు. ఈ రోజు ఉదయం రాజ్భవన్లో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అయితే చెప్పినట్టుగానే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ రోజు శాసనసభలో ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను అంటూ ప్రకటించారు. అసలు దీని వెనుక కారణం ఏంటా అని చూస్తే…అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేయను అంటూ రాజాసింగ్ ప్రకటించారు.

మామూలుగా చూసుకుంటే ఆయనకు ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఉండగా అప్పుడు తాను ప్రమాణ స్వీకారం చేయనని, తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు.
