సాధారణంగా పోలీసులను చూస్తే దొంగలు పరార్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. పరిగెత్తడమో.. దూరంగా వెళ్లి దాక్కోవడమో చేస్తూ ఉంటారు. కానీ ఈ దొంగ ఏమి చేసాడో చూడండి. ఏకంగా చెరువు లోకి వెళ్లి దూకేసాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు గంటల పాటు చెరువులోనే కాలం గడిపేశాడు. పోలీసులు ఎంత పిలుస్తున్నా వినలేదు.
వివరాల్లోకి వెళితే, తెనాలి పట్టణం ఐతానగర్ కు చెందిన మాతంగి భరత్ అనే వ్యక్తి పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. టూ-టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ గా కూడా ఉన్నాడు. అదే ప్రాంతంలో ఓ యువతిని వేధిస్తూ ఉన్నాడని ఫిర్యాదు రావడంతో.. అతనిని అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. అతను ఇంటివద్దే ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి వెళ్లారు.
అయితే.. వారిని గమనించిన భరత్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే చెరువులోకి దూకేసాడు. తన వద్ద బ్లేడ్ ఉందని.. తన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గొంతు కోసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసాడు. దీనితో.. అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు కుదరలేదు. ఉదయం 9 గంటలకు చెరువులోకి దూకిన భరత్.. మధ్యాహ్నం మూడు గంటల వరకు చెరువులోనే ఉన్నాడు.
చుట్టూ జనం మూగి.. జరుగుతున్నది చూస్తూ ఉండిపోయారు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు అక్కడే వేచి ఉన్నారు. భరత్ మాత్రం బయటకు రాకుండా.. ఇప్పటికే నాపై చాలా కేసులు పెట్టారు.. నేనే న్యాయవాదిని తీసుకుని స్టేషన్ కి వచ్చి లొంగిపోతా.. ఇప్పుడు వస్తే మాత్రం గొంతు కోసుకుంటా.. అంటూ గట్టిగా కేకలు వేసాడు. గంటల పాటు ఎదురుచూసిన పోలీసులు కొంచం పక్కకి వెళ్ళగానే.. భరత్ బయటకి వచ్చి పారిపోయాడు. ఈ విషయమై టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై భరత్ గతంలోనూ ఇదేవిధంగా హడావిడి చేసాడని.. తొందరలోనే అతన్ని అదుపులోకి తీసుకుంటాం అని చెప్పుకొచ్చారు.
Watch video:















