Ads
రానా, సాయి పల్లవి జంట గా నటిస్తున్న సినిమా “విరాటపర్వం”. ఇది కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఉడుగుల వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా నక్సలిజం కాన్సెప్ట్ తో రూపొందుతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది.
Video Advertisement
సాధారణం గా నక్సలిజం గురించి జనాలకు అవగాహన ఉన్నది చాలా తక్కువే. ఈ మాత్రం అవగాహనా కూడా సినిమాలను చూడడం వల్లనే వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే.. నక్సలైట్లు జనాల క్షేమం కోరినా.. సామాన్య ప్రజానీకానికి దూరం గా ఉంటారు.
సినిమాల ద్వారానే వీరు ఎలా ఉంటారో మనకి తెలుస్తూ ఉంటుంది. విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి ఓ సాధారణ ఆడపిల్లలా కనిపిస్తుంది. తాను ప్రేమించిన రానా కోసం అడవిబాట పడుతుంది. తాను కూడా నక్సలైట్ గా మారుతుంది. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి పాత్రని జజ్జర్ల సమ్మక్క అనే ఓ మహిళ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. సమ్మక్క బావ ఓ మావోయిస్టు. అతన్ని ప్రేమించిన సమ్మక్క అతని కోసమే బతికింది. అతని కోసమే అడవికి వెళ్లి మావోయిస్టు గా మారింది. చివరకు అతనితోనే ప్రాణాలు విడిచింది.
ఆమె బావ పేరు యాప నారాయణ అలియాస్ హరి భూషణ్. వీరి ప్రేమ అమరమైనది. చిన్నప్పటి నుంచి బావ తప్ప మరో లోకం తెలియని సమ్మక్క తన బావ చదువుకోవడానికి టౌన్ కి వెళ్ళినప్పుడు కూడా గుండెలు పగిలేలా ఏడ్చేసింది. డిగ్రీ చదువు చదువుకుని తన బావ తనకి మూడు ముళ్ళు వేస్తాడని ఆశపడింది. కానీ, అతను స్టూడెంట్ యూనియన్ పట్ల ప్రభావితుడై మావోయిస్టు దళంలోకి చేరిపోయాడు. దీనితో సమ్మక్క నిశ్చేష్టురాలు అయింది. బావతోనే తన లోకం అని నిశ్చయించుకుంది. సమాజానికి ఎదురెళ్లి బావని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోనే తన బావని పెళ్లాడింది.
తన ముప్పై ఏళ్ల ప్రస్థానంలో బావ వెంటే నడిచింది. ఆమె పడ్డ కష్టాలు, కార్చిన కన్నీళ్లు, బంధువులు, కుటుంబం, చట్టాలు.. ఇవేవీ వారి ప్రేమని విడదీయలేకపోయాయి. 2008 సమయంలో సమ్మక్క ఆరోగ్యం చెడిపోయింది. దీనితో వరంగల్ లో పోలీసులకు లొంగిపోయింది. తన అనారోగ్యానికి కావాల్సిన చికిత్సని చేయించుకుంది. ఆపరేషన్ అయ్యి పచ్చి కుట్లు ఆరకుండానే అడవిలోకి వెళ్ళిపోయింది.
ఆమె బావ పట్ల ఆమెకు ఉన్న ప్రేమ అలాంటిది. కానీ కరోనా వీరిద్దరిని వేరు చేసింది. హరిభూషణ్ కు అడవిలోనే కరోనా సోకింది. సమ్మక్క ఎన్ని సేవలు చేసినా అతను కోలుకోలేదు. అతను చనిపోయేసరికి సమ్మక్క తట్టుకోలేకపోయింది. ఆమెకు కూడా కరోనా సోకడంతో కోలుకోలేక కుప్పకూలిపోయింది. మన్యం లో వీరి ప్రేమ మొదలై అరణ్యంలో ముగిసింది. వీరి పాత్రలు ముగిసాయి కానీ.. వీరి ప్రేమ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. వీరు చేసింది తప్పా, ఒప్పా అన్న సంగతి పక్కన పెడితే.. ఒకరికోసం ఒకరు పడ్డ తపన.. వీరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం అనిర్వచనీయమైనది.
End of Article