Ads
ఒక నటుడికి మొదటి అవకాశం రావడం చాలా కష్టం. కానీ కొంత మందికి అది సులభంగానే వస్తుంది. కానీ ఆ అవకాశం వచ్చిన తర్వాత ఆ నటుడు ఎంత బాగా ఉపయోగించుకుంటాడు అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలా చాలా మంది హీరోలు ఎంతో కష్టపడి, ఇప్పుడు స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగారు.
Video Advertisement
కొంత మంది వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా, ఆ తర్వాత చాలా కష్టపడి వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని పెద్ద హీరోల రేంజ్ కి ఎదిగారు. అలా ఎదిగిన వారిలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలం సినిమాతో తనలో ఉన్న నటుడిని ప్రేక్షకులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందకపోయినా కూడా, రామ్ చరణ్ నటనకి, డాన్స్ కి చాలా మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ని పాన్-ఇండియన్ స్టార్ ని చేసింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేస్తారు అని అందరూ ఎదురు చూశారు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాని ఇవాళ ప్రకటించారు. అయితే కొంత మంది ఈ కాంబినేషన్ గురించి ఆసక్తి వ్యక్తం చేస్తున్నా, మరికొంతమంది మాత్రం ఈ సినిమాపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఇటీవల కొంత మంది స్టార్ హీరోలకి జరిగిన సంఘటనలు. అసలు మొదటిగా పాన్-ఇండియన్ సినిమా అంటే గుర్తొచ్చేది బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా దేశవ్యాప్తంగా విడుదల అయ్యాయి.
కానీ అవి ఏవి కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. కొంత మంది అయితే, ఆ సినిమాలు చూసి, “అసలు పాన్-ఇండియన్ సినిమాగా విడుదల చేసే అంత కథ ఇందులో ఏముంది?” అంటూ కామెంట్స్ చేశారు. కేవలం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలన్నీ అన్ని భాషల్లో విడుదల చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పాన్-ఇండియన్ రిలీజ్ అనేది ఒత్తిడితో ఉన్న అంశమే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమాల ఫలితం కూడా ఇలాగే అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ చాలా క్రేజ్ సంపాదించారు.
దాంతో విజయ్ దేవరకొండకి తెలుగులో మాత్రమే కాకుండా, మిగిలిన భాషలలో కూడా మార్కెట్ ఉంది అని అనుకున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దక్షిణాది భాషల్లో విడుదల అయితే, ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమాని పాన్-ఇండియన్ సినిమాగా కూడా విడుదల చేశారు. ఈ మధ్య సూర్య హీరోగా నటించిన ఈటి, అలాగే సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోణ సినిమాలు కూడా అలాగే విడుదల అయ్యాయి. కానీ ఆ సినిమాలు ఏవి కూడా అన్ని భాషల్లో మంచి ఫలితాన్ని సాధించలేదు.
దాంతో ఇప్పుడు చాలా మంది, “రామ్ చరణ్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ వల్ల ఇది కూడా పాన్-ఇండియన్ సినిమాలాగానే విడుదల అవుతుంది. కానీ బుచ్చి బాబు ఒత్తిడికి లోనవకుండా సినిమా తీయగలుగుతారా?” అని అంటున్నారు. ఇందుకు కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాల దర్శకులు కూడా కొత్త దర్శకులు. వారి రెండవ సినిమాకి పాన్-ఇండియన్ సినిమా అంటే రిస్క్ అయిన విషయం. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు.
దాంతో బుచ్చి బాబులాంటి కొత్త దర్శకుడు, తన రెండవ సినిమా ఇలాంటి పెద్ద స్టార్ హీరో రేంజ్ కి సరిపోయేలాగా తీయగలుగుతారా అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా, మధ్యలో శంకర్-రామ్ చరణ్ సినిమా ఉంది. ఈ సినిమా ఫలితాన్ని బట్టి బుచ్చి బాబు సినిమా ఉంటుంది అని అంటున్నారు. ఒకవేళ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హిట్ అయితే, అలాంటి రేంజ్ సినిమా బుచ్చి బాబు చేయాలి. ఈ రకంగా ఒక ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే, బుచ్చి బాబుతో రామ్ చరణ్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. దాంతో ఒత్తిడి మరొక రకంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఒక కొత్త సినిమా డైరెక్టర్ కి ఇది చాలా పెద్ద బాధ్యత అని అంటున్నారు.
End of Article