భారత్ దేశంలో దాదాపు ప్రతి ఇంటికి ముందు గడప ఉంటుంది. ఎవరైనా లోపలకి రావాలంటే.. లోపలి నుంచి బయటకు వెళ్ళ్లాలంటే గడపని దాటుకుంటూనే రావాలి. తరాలు మారుతున్నా ఇంటి గడప ఉండడం మాత్రం మారదు. హిందువులు గడపను పెట్టుకొనే విషయంలో ఎన్నో నమ్మకాలను కలిగి ఉంటారు.
ఇంట్లో ఉన్న ప్రతి గదికి మధ్య ఉన్న తేడాను తెలిపేదే గడప. గడప ద్వారానే వంట గదికి, పూజ గదికి, పడక గదికి తేడా తెలుస్తూ ఉంటుంది. గడపను దాటేటప్పుడు ఇంట్లో అయినా, దేవాలయాల్లో అయినా దానిని తొక్కకూడదు అని చెబుతూ ఉంటారు.
అయితే.. ఇంట్లో ఉండే గడపను అయినా చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే గడప గౌరీ దేవి స్వరూపం. గడపని పూజించే విధంగా గడప గౌరీ దేవి నోముల గురించి కూడా పెద్దలు ముందే చెప్పారు. మరోవైపు గడపను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పడం కూడా ఈ నోముల ఉద్దేశ్యం. గడపను శుభ్రంగా ఉంచుకున్న వారి ఇళ్ళని లక్ష్మీదేవి కటాక్షిస్తుందట. వారి ఇళ్ళని ఎప్పుడూ వీడకుండా ఉంటుందట.
ఇంటి ముఖద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తోరణాలతో అలంకరించి కళగా ఉంచుకోవాలి. గుమ్మాన్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలతో అలంకరించాలి. గడప లో చీలికలు, నరుకులు లాంటివి వస్తే గడపను మార్పించుకోవాలి. గడప ముందే చెప్పులు విడవకూడదు. గడపకు దూరంగా ఉండాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ గడపని చేరుతుంది. అందుకే గడపకు ధూపం వేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీని బయటకు పంపాలి.
చీపురు, చేటలు వంటి వాటిని తలుపు వెనుక పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ పెట్టడం వలన అవి గుమ్మానికి తగులుతూ ఉంటాయి. అలా ఉంచకూడదు. ఇంకా.. చాల మంది కాళ్ళు తుడుచుకునే పట్టాలను కూడా గుమ్మముపైన వేస్తూ ఉంటారు. ఇలా కూడా వేయకుండా చూసుకోవాలి. గడపను, గడప చుట్టూ ఉండే ప్రదేశాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటె అక్కడే లక్ష్మీదేవి కొలువవుతుంది.





























