Home Mythology “భైరవకోన” ప్రత్యకత ఏమిటి…? కార్తీక పౌర్ణమి నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా…?

“భైరవకోన” ప్రత్యకత ఏమిటి…? కార్తీక పౌర్ణమి నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా…?

by Sainath Gopi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. శివాలయం చిన్నగా లేదా పెద్దగా ఉన్నా భక్తులు అక్కడికి వెళ్లి పూజలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అక్కడ ఉన్న శివాలయాలలో ఒక శివాలయం భైరవకోనలో ఉంది.

శివాలయం ఒకటే కాదు, దుర్గా దేవి ఆలయం, త్రిమూర్తుల ఆలయం, గ్రానైట్ శిలలతో చెక్కబాదిన శివలింగాలు, ఆకాశగంగలా అనిపించే జలపాతం, ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటాయి. ఇవే కాక ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రాత్రి జరిగే విశేషం చూడడానికి వేలాది భక్తులు వస్తారు. అడి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భైరవకోన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి అనే గ్రామానికి సమీపంగా వుంది. కొత్తపల్లి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్య క్షేత్రం కలదు.చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, భైరవకోన ఆలయ చరిత్ర 7వ శతాబ్దానికి చెందినది. ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే, ఒకప్పుడు కాల భైరవుడు ఈ ప్రాంతాన్ని పాలించాడని అందువల్లనే దీనికి భైరవకోన ఆలయం అని పేరు వచ్చిందని అంటారు.  కాల భైరవుడు ఈ ప్రదేశానికి కాపలాగా ఉంటాడని చెబుతారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పురాతన హిందూ దేవాలయాలు కనుగొన్నది భైరవకోనలోనే. ఇక్కడ 8 హైందవ దేవాలయాలున్నాయి. పల్లవరాజులు ఈ  శివాలయాలను అద్భుతంగా నిర్మించారు. కొండల్ని గుహాలయాలుగా మలచటం పల్లవరాజుల కాలంలోని గొప్ప కళ. ఇక ఈ గుహల గోడల పైన పల్లవుల కాలంలోని అనేక శిల్పకళలను చూడవచ్చును. వీటిని పల్లవ శిల్పులు అయిన దేరుకంతి, శ్రీశైలముని వంటివారు భైరవకోన క్షేత్రాన్ని మలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఒకే కొండ‌లో 8 ఆల‌యాలు, వాటి చుట్టూ ఎటు చూసినా న‌ల్ల‌మ‌ల అడ‌వులు  8 ఆల‌యాలలో దేవుళ్ళు శిలా రూపంలో దర్శనమిస్తారు.
ఇక్కడ ఒకే  కొండలో 8 ఆలయాలు చెక్కిన విధానం ఎంతో అపురూపంగా ఉంటుంది. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, నగరికేశ్వర, విశ్వేశ్వర, మల్లికార్జున, భార్గేశ్వర, రామేశ్వర, పక్షమాలిక లింగ. ఇందులో 7 దేవాలయాలు తూర్పుముఖానికీ ఉండగా, ఒకటి దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. ఆలయాలలోని శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కారు. ఇక్కడ త్రిమూర్తులను ఒకే ఆలయంలో పూజిస్తారు. శివలింగం మధ్యలో ఉండగా గుహ గోడల పై ఒకవైపు గోడ పై బ్రహ్మ, మరొక వైపు గోడ పై విష్ణువులు శిల్పారుపాలలో ఉన్నారు.
శివాలయాలన్నీ పై వరసలో ఉండగా, కింద ఉండే ఆలయంలో త్రిముఖ దుర్గ, శివలింగం పూజలు అందు కుంటున్నాయి. దుర్గ దేవి ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలతో ఉంటుంది. దుర్గాదేవి కుడివైపున మహాకాళి ముఖం, నోట్లోంచి జ్వాల వస్తున్నట్టుగా వుంటుంది. మధ్యన మహాలక్ష్మి, ప్రసన్నమైన ముఖం. ఎడమవైపున ముఖం సరస్వతీదేవి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీ దేవి అద్దం చూసుకుంటూ కనిపిస్తుంది.
అమ్మవారి విగ్రహం పైన కార్తీకపౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడటం భైరవకోన మరో విశేషం. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్ర బింబం, దుర్గ ఆలయాలనికి 3 అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, ఆ చంద్ర కిరణాలు దుర్గాదేవి విగ్రహం పై పడుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తారు.

Also Read: గురు పౌర్ణమి నాడు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే అంతా శుభమే..!

You may also like