తిరుమల… నిత్యం భక్తుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే హిందూ ఆలయం. మన దేశమే కాదు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందువులందరు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే దివ్యక్షేత్రం. ఇక్కడి స్వామి వారు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై కొలువుదీరాడు. దైవత్వంలోనే కాదు నిర్మాణంలో కూడా విశిష్టత కలది మన తిరుమల దివ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో? దాని చరిత్ర ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా?
తోండైమండలం తమిళ పాలకుడు తొండమాన్ కలలో స్వామి వారు సాక్షాత్కరించి తనకు ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడంతో మురిసిపోయిన తొండమాన్ కీ .శ. 8 వ శతాబ్దంలో తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్నిగాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు.
గర్భగుడిని ఆనందనిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. అందుకే ఇప్పటికీ ఇక్కడ పూజలు ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి.
ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో . 300 లో ప్రారంభమైందని నమ్ముతారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు (తంజావూరు), పాండ్య రాజులు (మదురై), 13-14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది.
విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.