కరోనా సమయంలో ఎంత మంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యల తర్వాత ప్రజలు అంతగా ఇబ్బంది పడింది ఆర్థిక సమస్యల కారణంగానే. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో సంస్థలు ఆర్ధికంగా వెనకబడ్డాయి. ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఉండేది. కొంత మంది అయితే నోటీస్ పిరియడ్ లో ఉద్యోగం చేశారు.

కేరళలోని కసర్ గాడ్ కి చెందిన నవనీత్ సజీవన్ ఈ కోవకి చెందిన వారు. వివరాల్లోకి వెళితే. నవనీత్, గత నాలుగు సంవత్సరాలుగా అబుదాబిలో నివసిస్తున్నారు. కరోనా కారణంగా నవనీత్ ఉద్యోగం చేసే సంస్థలో ఉద్యోగులను తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో నవనీత్ నోటీస్ పిరియడ్ కింద ఉద్యోగం చేస్తున్నారు.

అయితే, నవంబర్ 22 వ తేదీన నవనీత్ ఆన్లైన్ లో ఒక లాటరీ టికెట్ కొన్నారు. గత ఆదివారం దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా వాళ్ళు నవనీత్ కి ఫోన్ చేసి తాను లాటరీ గెలుచుకున్న విషయాన్ని తెలియజేశారు. ఈ లాటరీలో భాగంగా నవనీత్ గెలుచుకున్న మొత్తం దాదాపు 7.4 కోట్ల రూపాయలు. దీంతో నవనీత్ ఆనందానికి అవధులు లేవు.

ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న నవనీత్ కి ఇలా లాటరీ రూపంలో కలిసి వచ్చింది అని అన్నారు. అంతే కాకుండా ఈ డబ్బులో కొంత భాగాన్ని కుటుంబ అవసరాల కోసం ఉపయోగిస్తానని, ఇంకొంత మొత్తాన్ని తన స్నేహితులకు, సహోద్యోగులకు ఇస్తానని నవనీత్ పేర్కొన్నారు.
