Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని శ్రీవల్లి, సామి సామి పాటలు అపూర్వ ప్రజాదరణ పొందాయి. ఈ పాటలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో విస్తృతంగా ఉపయోగించారు.
ఈ తెలుగు సినిమా తాజాగా రష్యాలో విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఆ దేశవ్యాప్తంగా పుష్ప ఫీవర్ పట్టుకుంది. రష్మిక మందన్న ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిన సామీ సామీ పాటను ప్రస్తుతం రష్యా అభిమానులు ఆస్వాదిస్తున్నారు. రష్మిక మొదలు పెట్టిన ట్రెండ్ని ఫాలో అవుతూ రష్యా అభిమానులు ఈ పాటకు చేస్తున్న డాన్స్ లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద ఉన్న స్టేట్ హిస్టారికల్ మ్యూజియం ముందు రష్యా మహిళల బృందం ‘సామీ సామీ’ పాటకు కాలు కదిపింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
ఈ డాన్స్ క్లిప్ను ఆడిటర్గా ఉన్న నటాలియా ఒడెగోవా అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో మహిళల డాన్స్ చేస్తుండగా, ఒక పాప వారిని అనుకరించి ఆకట్టుకుంది. బుధవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప-ది రైజ్ రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అల్లు అర్జున్ మరియు పుష్ప టీం ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో పుష్ప ప్రీమియర్షోను ప్రదర్శించారు. దీనికి కథానాయకుడు అల్లు అర్జున్, నాయిక రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అంతే కాకుండా డిసెంబర్ 3న సెయింట్పీటర్స్బర్గ్లో మరో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ మరియు అతని బృందం ఇటీవల దీనికి సంబంధించి విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.

‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్టైటిల్స్తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్బర్గ్లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.



