Ads
మనలో చాలా మందికి నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది. అది చిన్నప్పుడు చూసింది అయినా కావచ్చు లేదా కొత్తది కూడా అవ్వొచ్చు. అటువంటి సినిమాలు ఎన్ని సార్లు టీవీ లో చూసినా బోర్ కొట్టదు.
Video Advertisement
కానీ కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తేనే బావుంటుంది. కానీ పాత సినిమాలు థియేటర్ల లోకి వచ్చేదెలా అని ఫీల్ అవుతారు చాలా మంది. కానీ దీనికి పరిష్కారంగా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది.
తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు లేదా, ఒక సినిమా ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాలను పురస్కరించుకొని వారి బ్లాక్ బస్టర్ చిత్రాలను డిజిటలైజ్ చేసి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజుకి ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ‘తమ్ముడు’, ‘జల్సా’ చిత్రాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇకముందు కూడా ఇలా పాత చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా దీనికి మరో కోణం కనిపిస్తోంది. కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకున్న అనంతరం కొన్ని నెలలుగా థియేటర్లలో సినిమాల సంఖ్య బాగానే కనిపిస్తోంది. వాటిలో కంటెంట్ ఉన్నవి మాత్రమే బాక్సాఫీస్ దగ్గర నిలబడగలుగుతున్నాయి. కంటెంట్ లేని చిత్రాలు ఒక్కరోజు కూడా థియేటర్లో నిలబడిన దాఖలాలు లేదు. కనీస వసూళ్లు రాబట్టలేకపోయాయి. అది స్టార్ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా ప్రేక్షకుల తీర్పు ఒకేలా ఉంటుంది.
ప్రేక్షకుల అభిరుచి ఇంతకు ముందులా లేదు. కథలో వైవిధ్యం తో పాటు వినోదం వంటి అన్ని అంశాలు సమ పాళ్ళలో ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా రీ రిలీజ్ చేసిన రెండు చిత్రాలను ప్రేక్షకులు విపరీతమైన క్రేజ్తో చూశారు. అంటే దీనర్థం ఈ సినిమాల్లో ఏదో వుంది, ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ ఉంది. అందుకనే ఇన్నేళ్ల తరువాత కూడా ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించగలిగాయి.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలే ఓటీటీల్లో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు కూడా. అయినప్పటికీ మళ్లీ థియేటర్స్లో చూశారంటే.. ఆ సినిమాల్లో తమ అభిమాన హీరోలు ప్రేక్షకుడి అభిరుచి తగ్గట్లు చేసి ఉండొచ్చు.కానీ అదే స్టార్ హీరోలు నటించిన కొత్త చిత్రాలు ప్రేక్షకులను ఎందుకు మెప్పించలేకపోతున్నాయి. ఇప్పటి సినిమాల్లో ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అంశాలను ఇవ్వలేకపోతున్నారేమో అనిపిస్తోంది.
పాత చిత్రాల్లో హీరోల నటన ఒక్కటే కాదు, కథలో కొత్తదనం, వినోదం, పాటలు రక్తికట్టించేలా ఉండేవి. అందుకనే అప్పట్లో అవి ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు కూడా అదే చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అంటే అప్పటి కథల్లో ఏముంది? ఇప్పుడు ఏం మిస్ అయింది అన్నది హీరోలు, మేకర్స్ ఒకసారి దాచి చూసుకోవడం ముఖ్యం..అందరు హీరోలు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. కాంబినేషన్ కన్నా కంటెంట్ ముఖ్యం అన్నది గుర్తించినప్పుడే పరిశ్రమ బాగుపడుతుందని తెలుసుకోవాలి.
End of Article