జాతక దోషాలకు పరిహారం అవ్వాలన్నా, గ్రహాలు అనుకూలించాలన్నా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అని చెబుతుంటారు. అష్టకష్టాలు పడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న వారు నవగ్రహాలను వేడుకుంటే.. వారు కరుణించి జీవితం సవ్యం గా నడిచే విధం గా చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణాలు చేసే ముందు శుచిగా స్నానం చేసి.. శుభ్రం గా ఉండాలి.
అయితే మీరొక విషయం గమనించారా? నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. దీని వెనుక కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారు. ఈ దేవతలను సాక్షాత్తు పరమేశ్వరుడే నియమించారు. నవగ్రహాలకు మూలం అయిన సూర్యుడికి కూడా ఆది దేవుడు ఆ పరమేశ్వరుడే. అందువల్లనే ఈ గ్రహాలన్నీ ఆ పరమశివుని ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఉంటాయి. అందువల్లే ప్రతి శివాలయంలోని నవగ్రహాల దేవాలయం తప్పని సరిగా ఉంటుంది. ఇతర దేవాలయాల్లో నవగ్రహాల మండపం ఉన్నా , లేకపోయినా పరమేశ్వరుడి దేవాలయంలో మాత్రం కచ్చితంగా నవగ్రహ మండపాలు ఉంటాయి.
పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం మనకు పరమశివుని అనుగ్రహం ఉంటె.. నవగ్రహాలు మనపై దుష్ప్రభావాన్ని చూపలేవని పెద్దలు చెబుతుంటారు. అందుకే.. శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఆ దేవదేవునికి అభిషేకం చేయించి.. ఆయన ప్రీతి చెందిన తరువాత నవగ్రహాలకు నమస్కరించుకుంటారు. మరికొంతమంది అయితే.. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. ముందు మూల విరాట్టు ను దర్శించుకున్నాక.. గుడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయడం కూడా సరికాదు. ప్రధాన ఆలయ దర్శనం అయ్యాక నవగ్రహాలను కూడా దర్శించుకోవాలి.


