లోకనాయకుడు కమల్ హాసన్ జీవితంలో మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ ‘మరుదనాయగం’ లాంచింగ్ ఈవెంట్కు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 హాజరయ్యారు.
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (96) గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్లోఆమె కన్నుమూశారు. మహారాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. 1952, ఫిబ్రవరి 6 నుంచి దాదాపు 70 ఏళ్లపాటు క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్కు మహారాణిగా వ్యవహరించారు.
క్వీన్ మరణంతో కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. అందులో ఆమె భారత్ కు వచ్చినపుడు తన చిత్ర షూటింగ్ ను సందర్శించారని ఆయన తెలిపారు. కాగా ఈ విషయం చాల మందికి తెలియదనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. మహారాణిగా క్వీన్ ఎలిజబెత్-2 మొత్తం మూడు సార్లు భారత్ పర్యటనకు విచ్చేశారు. మొదటిసారిగా 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఇండియా పర్యటనకు వచ్చారు. అయితే 1997లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంవత్సరం లోకనాయకుడు కమల్ హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ ‘మరుదనాయగం’ లాంచ్ చేశారు. ఈ వేడుకకు క్వీన్ ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా రావడం విశేషం.
క్వీన్ ఎలిజబెత్-2 సెట్కు రావడంతో షూటింగ్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. రూ.1.5 కోట్లతో భారీ యుద్ధ సన్నివేశాన్ని షూట్ చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు క్వీన్ మూవీ సెట్లోనే గడిపారు. ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కూడా హాజరయ్యారు. అప్పట్లో ఈ సినిమాకు కమల్ హాసన్ దర్శకత్వం వహించి.. రూ.80 కోట్లతో నిర్మిద్దామని ప్లాన్ చేశారు. ఈ మూవీ కథను సిద్ధం చేసేందుకు ఆయన ఆరేళ్లు కష్టపడ్డారు.
కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చిన ఓ ఇంటర్నేషనల్ కంపెనీ అనుకోకుండా వెనక్కి వెళ్లిపోవడంతో మరుదనాయగం సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది.
క్వీన్ ఎలిజబెత్-2 మరణం పట్ల కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమెను యావత్ ప్రపంచం మొత్తం అభిమానించింది. 25 ఏళ్ల క్రితం మా ఆహ్వానాన్ని మన్నించి మరుదనాయగం మూవీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. బహుశా ఆమె హాజరైన ఏకైక సినిమా షూటింగ్ ఇదేనేమో. ఐదేళ్ల క్రితం లండన్లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమెను ప్యాలెస్లో కలవడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ‘ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.