సింగర్ యశస్వి కొండేపూడి.. తెలుగు టీవీ షోల ద్వారా, తన పాటల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే అతడిపై ఇప్పుడు చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆ సంస్థ అసలు నిర్వాహకులు బయటకు వచ్చారు. సాక్షి కథనం ప్రకారం, నవ సేన అనే ఎన్జీవో సంస్థను నడుపుతూ ఎంతో మంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటున్నట్టు యశస్వి చెప్పిందంతా అబద్ధమేనని ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.
కాకినాడలోని నవసేన ఫౌండేషన్ పేరుతో ఉన్న ఎన్జీవో సంస్థ యాభై-అరవై మంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంది. ఆ సంస్థ తనదే అంటూ సింగర్ యశస్వి గతంలో చెప్పుకొచ్చాడు. నవసేన ఫౌండేషన్ లో ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి వారందరి బాగోగులు తానే చేసుకుంటున్నాడని గతం లో చెప్పాడు యశస్వి. సింగర్ యశస్వి మోసం చేస్తున్నారని కాకినాడ నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించారు. తన సంస్థను ఆయన సంస్థ అని చెప్పుకుంటూ యశస్వి మమ్మల్ని మోసం చేశాడని అంటున్నారు. అది తానే నడుపుతున్నట్లు ఓ సింగింగ్ కాంపిటీషన్లో సానుభూతి, ఓట్ల కోసం వినియోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.

గత అయిదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 56 మంది పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నానని.. నవసేన ఫౌండేషన్కు ఏ సెలెబ్రిటీ నుంచి సహకారం లేదని ఫరా కౌసర్ తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా యశస్విని కలిసి క్షమాపణ చెప్పాలని కోరినా అతడు పట్టించుకోలేదని ఫరా వెల్లడించారు. తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటోన్న యశస్విపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయం పై యశస్వితో పాటు సదరు టీవీ ఛానెల్, వ్యాఖ్యాతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫరా వెల్లడించారు. కాగా సరిగమప షో తో యశస్వి సెలెబ్రెటీగా మారాడు. ఈ క్రేజ్ తో అతడు పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు.. చాలా ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు. కాగా ప్రస్తుతం అతడిపై ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యం లో అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
watch video :



















