మీరు గమనించే ఉంటారు. 2017 తరువాత వచ్చిన అన్ని టూవీలర్స్ లో హెడ్ లైట్స్ ఆన్ లోనే ఉంటున్నాయి. కనీసం.. వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉండదు. సాధారణం గా ఉదయం సమయాల్లో వెలుతురు గానే ఉంటుంది కాబట్టి మనకి హెడ్ లైట్స్ అవసరం లేదు. కానీ, ఈ లైట్స్ ని ఆఫ్ చేసే అవకాశం లేకపోవడం తో అవి వెలుగుతూనే ఉంటాయి.
ఇలా ఎందుకు ఉంటాయి. మార్నింగ్ టైం లో కూడా హెడ్ లైట్ ఆన్ లో ఉండాల్సిన అవసరం ఏంటో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లోకి వచ్చే అన్ని కొత్త మోటార్ బైక్స్ మరియు స్కూటర్లు ఏప్రిల్ 1, 2017 నుండి AHO ని కలిగి ఉండాలి. AHO అంటే ఆల్-టైమ్ హెడ్లైట్ ఆన్ లేదా ఆటోమేటిక్ హెడ్లైట్ ఆన్ సిస్టమ్ అని అర్ధం.
ఈ పేరు కు తగ్గట్లే, ఏప్రిల్ 1, 2017 తర్వాత విక్రయించబడిన మరియు రిజిస్టర్ చేయబడిన కొత్త మోటార్ సైకిళ్ళు మరియు స్కూటర్లు అన్ని సమయాల్లో హెడ్ లైట్లను కలిగి ఉండాలి. ఈ మేరకు భారత రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. AHO ఉన్న బైక్స్ కి లైట్ ని ఆఫ్ చేయడానికి బటన్ ఏమి ఉండదు. హెడ్ లైట్స్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి.
అయితే, హై బీమ్, లో బీమ్ బటన్స్ మాత్రం ఉంటాయి. తద్వారా మనం లైటింగ్ కెపాసిటీ ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ రూల్ ను తీసుకొచ్చారు. మబ్బు పట్టినప్పుడు, సాయం సమయాల్లోనూ ఇలా ఎప్పుడు హెడ్ లైట్స్ ఆన్ లోనే ఉండడం వలన దూరం గా ఉన్న వాహనాలను కూడా మనం గుర్తించగలుగుతాం.
అయితే దీనివలన బండి బాటరీ పై కొంత ఒత్తిడి పడినప్పటికీ, బాటరీ ఏమి పాడవదు. చాలా బైక్స్ లేటెస్ట్ టెక్నాలజీ బాటరీ ఆల్టర్నేషన్ వ్యవస్థ తో రూపొందించబడ్డాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధునాతన టెక్నాలజీ ని వినియోగించడం వలన ఫ్యూయల్ వ్యవస్థ పై కూడా ఎక్కువ ఒత్తిడేమి ఉండదు. దానివలన పెట్రోల్ కూడా ఎక్కువ గా వృధా కాదు. కాబట్టి ఈ విషయం లో ఆందోళన అవసరం లేదు.