మన హిందూ ధర్మం పాటించే వారిలో అనేక మంది మాంసాహారం తినేవారు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ చికెన్ మసాలా వాసనలు బయట వరకు వెళుతూనే ఉండాలి. అయితే మన హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన రోజులకు కొన్ని నియమాలు ఉన్నాయి.
ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తారో వారు ఖచ్చితంగా ఆ రోజులలో మాంసాన్ని తినకపోవడమే మంచిది. చాలా మందికి ఈ అనుమానం ఉండే ఉంటుంది. అది ఏంటంటే.. అమావాస్య రోజు మాంసం తినవచ్చా..?

అన్ని రోజులకంటే అమావాస్య, పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. పౌర్ణమి రోజున దేవతలను ఏవిధంగా పూజిస్తామో, అదే విధంగా అమావాస్య రోజున మరణించిన మన పెద్దలను పూజిస్తూ ఉంటాము. అంటే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తుంటారు.
అసలు పితృతర్పణము అంటే ఏంటో తెలుసుకుందాం.. మన అరచేతిలోని నువ్వులు వేసుకుని నీటితో వదిలితే దాన్ని పితృతర్పణం అంటారు. ఎందుకంటే మనకి అరచేతిలోనే సకల దేవతలు కొలువై ఉంటారు. ఆ సకల దేవతలో మన పెద్దలు కూడా ఒకరు.

పెద్దలకు ఇష్టం కదా అని మాంస పదార్థాలను మరియు కొన్ని కొన్ని పిండి వంటలు చేసి వాళ్ళముందు నైవేద్యంగా పెడతారు. పితృతర్పణాలు చేసే సమయంలో మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది మహాపాపం. సాత్వికమైన, కూరగాయలతో వండిన పదార్థాలు లేదా పిండివంటలతో నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వలన పెద్దలకు ఆత్మ శాంతి చేకూరుతుంది.

అమావాస్య రోజున పితృ దేవతలను ఆరాధించే రోజు కాబట్టి ఆ రోజున మాంసం తినకూడదు అనే నియమం పురాతన కాలం నుంచి వర్తిస్తుంది. అమావాస్య రోజున కేవలం సాత్వికమైన ఆహారం తీసుకోవడమే ప్రతి ఒక్కరికి మంచిది. అమావాస్య రోజు ఎవరైతే మాంసాహారాన్ని ఆహారంగా తీసుకుంటారో వాళ్ల పితృదేవతలకు ఆత్మ శాంతిచేకూరదు.
