Ads
శివుడు భక్త సులభుడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రాయశ్చిత్తంతో పాప పరిహారం కోసం, చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేసినా చాలు సంతృప్తి చెందుతాడు. అభయమిస్తాడు. అట్టి పరమేశ్వరుడు రామాయణ కాలం నుంచే లింగ రూపం లో పూజలందుకుంటున్నాడు. శ్రీ రాముడు కూడా రావణ హత్య చేసిన తరువాత.. బ్రాహ్మణ హత్య చేశానని దుఃఖించి.. పరిహారం కోసం చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్టించాడని చెబుతుంటారు.
Video Advertisement
పరశురాముడు కూడా కార్త్యవీర్యార్జునుడితో పాటు పలువురిని హత్య చేసిన సంగతి మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ పాపం పోగొట్టుకోవడం కోసం.. పరమేశ్వరుని లింగాన్ని ప్రతిష్టించాలని సంకల్పించాడు. ఈ హత్యలు చేసాక పరశురాముడు పశ్చాత్తాపం తో క్రౌంచ పర్వతం పై చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసాడు. ఆ తరువాత, శివలింగాన్ని ప్రతిష్టించడం కోసం అనువైన ప్రదేశాన్ని వెతికాడు. గోస్తనీ నదీ తీరం లో లింగాన్ని ప్రతిష్టించాలని భావించాడు. అక్కడే శ్రీరాముడు కూడా సీతాదేవి తో కలిసి ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు.
ఇసుక, నత్తలతో సీతారాములిద్దరు ఆ లింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివలింగాన్ని నత్తా రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. వారిద్దరూ శివలింగాన్ని ప్రతిష్టించాక, మిగిలిన ఇసుకను అక్కడే వదిలేసారు. ఆ మిగిలిన ఇసుక, నత్తలతో పరశురాముడు మరొక లింగాన్ని సీతారాములు ప్రతిష్టించిన లింగం పక్కనే ప్రతిష్టించాడు. అయితే, ఆ లింగం అగ్ని లింగం లా గోచరించసాగింది. పరశురాముడు మహా కోపిష్టి స్వభావి కదా.. అందుకే ఆ లింగం కూడా భగ భగ మండుతూ దర్శనమిచ్చింది.
దీనితో, నా అహంకారం ఇంకా తగ్గలేదా అంటూ బాధపడ్డాడు. వెంటనే ఆ లింగం చుట్టూ కొంత భాగం తవ్వి ఒక చెరువు లా ఏర్పాటు చేసాడు. అందులో గోస్తనీ నది నుంచి నీటిని తీసుకొచ్చి నింపేసాడు. ఆ తరువాత స్వామి కొంత చల్లబడ్డాక, స్వామీ నీకు పూజలెలా జరుగుతాయి అంటూ బాధపడసాగాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు కనిపించి.. బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీటిలోనే ఉండి..ఒక్క ఫాల్గుణ మాసం లో మాత్రం అందరికి దర్శనమిస్తానని మాట ఇచ్చాడు.
అప్పటి నుంచి ఈ ప్రాంతం లో ఒక శివలింగం గర్భ గుడిలోనూ, ఒక శివలింగం బయట దర్శనమిస్తూ ఉంటాయి. పరశురాముడు ప్రతిష్టించిన ఈ లింగాన్ని పరశురామేశ్వర లింగం అని పిలుస్తుంటారు. ఈ పుణ్య క్షేత్రాన్ని అందరు తప్పక దర్శించాలి. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం లోని “నత్తా రామేశ్వరం” వద్ద ఈ పుణ్య క్షేత్రం ఉంది.
End of Article