మనం నిత్యం పూజించుకునే దేవుళ్ళ విగ్రహాలను అపురూపం గా చూసుకుంటూ ఉంటాము. మన ఇష్టదైవాల విగ్రహాలను ఇంట్లో పూజ గదిలో ఉంచుకుని పూజించుకోవడం అందరం చేసే పనే. అయితే.. కొన్ని కొన్ని సార్లు ఈ విగ్రహాలు పగలడం లేదా, బీటలు వారడం వంటివి జరుగుతుంటాయి.
చాలా మంది తమ ఇష్టదైవాల విగ్రహాలు పగిలిపోతే, లేక పూజ సమయం లో దీపం కొండెక్కితేనో ఏదో అరిష్టం జరగబోతోందని బాధపడిపోతుంటారు. అలాంటి విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే కీడు జరుగుతుందని భావించి ఆ విగ్రహాలను ఎవరు తిరగని ప్రదేశాల్లోనే, నీటిలోనో పడవేస్తుంటారు. కానీ, ఇది చాలా తప్పు. నిజానికి ఇలాంటివి జరగడం వలన మనసులో ఆందోళన కలగడం సహజమే. కానీ, దీనిని మనం ఎలా అర్ధం చేసుకోవాలో తెలుసా?
అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే.. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు.. భగవంతుడు ఆ కష్టాన్ని తాను స్వీకరిస్తే ఇలా విగ్రహాలు చీలిపోవడం, పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం అరిష్టమేమి కాదు. మనకు కాలో, చెయ్యో విరిగిపోతే మనల్ని తీసుకెళ్లి బయట పడేయరు కదా.. అలానే విగ్రహానికి కూడా మరమ్మత్తు చేసుకుని పూజ గదిలోనే ఉంచి పూజించుకోవచ్చు.
చాలా మంది ఇంట్లో పాడైన ఫోటోలను, విగ్రహాలను తీసుకెళ్ళి గుళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు. లేకపోతే రావి చెట్టు, వేప చెట్టు ఉన్నచోట పడవేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం కూడా సరికాదట. అలా నిర్జన ప్రదేశాల్లో దేవుడిని ఎటువంటి అనుష్ఠానం జరగని చోట వదిలివేయడం కూడా సరికాదు.







































