చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మనకు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అయితే.. వారిని ఎలా ఎదుర్కొంటాం అన్నది మన తెలివితేటలపైనా, శక్తిసామర్ధ్యాల పైనా ఆధారపడి ఉంటుంది. చాణక్యుడు సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలి అన్న విషయమై కొన్ని సలహాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శక్తిని పెంచుకోవడం: ఫోన్ లో సాఫ్ట్ వేర్ లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసినట్లు మీ శక్తియుక్తులను కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. సమయానికి తగ్గట్లు మీ బలాన్ని పెంచుకోవడం వల్ల మీ శత్రువులకు మీకు ఏమైనా ఇబ్బంది కలిగించాలన్నా ఆలోచనలో పడతారు. ఎవరైనా బలహీనంగా ఉన్నపుడే శత్రువులు దాడికి ఉపక్రమిస్తారు. అందుకే మీ శక్తియుక్తుల్ని పెంచుకోవడం అవసరం.
ప్లానింగ్: చాణక్యుడు చెప్పిన రెండో విషయం ఏంటంటే ప్రణాళిక వేసుకోవడం. ఏ పని చేయదలచుకున్న అందుకు అవసరమైన ప్లానింగ్ ను ముందుగానే వేసుకుని పధకం ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని కూడా సరైన ప్లానింగ్ తో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే మీ ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియనివ్వకపోవడమే మంచిది. పని పూర్తి అయ్యేవరకు సహనం వహించాలి. లేదంటే అదను చూసి శత్రువులు దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది.
మాటతీరు: చికత్స కంటే నివారణే ముఖ్యం అన్న సామెత ఉండనే ఉంది కదా.. శత్రువులు ఉంటె ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అసలు శత్రువులే లేకుండా ఏ గొడవా ఉండదు. అందుకే.. మన మాటతీరు మంచిగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మీ మాట తీరు బాగుంటే.. మీరు అందరిని ఆకట్టుకోగలుగుతారు. శత్రువులు కూడా తక్కువగా ఉంటారు.
వినయం: శత్రువులు తక్కువగా ఉండాలంటే మీరు ముందు వినయ విధేయతలతో ఉండాలని చాణుక్యుడు చెబుతున్నాడు. అహంకారం అన్ని అనర్ధాలను తీసుకొస్తుంది. శత్రువుల్ని పెంచుతుంది. అదే వినయంగా ఉన్నవారికి జనబలం ఉంటుంది. అందరి ఆప్యాయతలు లభిస్తాయి. అలాంటివారిని చూసి శత్రువు సైతం భయపడతాడు.




































