ప్రతి పూజలోను ముందు వినాయకుడికి పూజ చేస్తాం. ఏ పని మొదలుపెట్టినా.. విఘ్నాలు రాకుండా కాపాడమని వినాయకుడిని వేడుకుంటాం. అలాగే.. వినాయకుడికి దణ్ణం పెట్టడం తో పాటు మొట్టికాయలు కూడా వేసుకుంటూ ఉంటాం. ఏ దైవానికైనా దణ్ణం పెట్టె మనం.. వినాయకుడి వద్ద మాత్రం మొట్టికాయలు ఎందుకు వేసుకుంటాం..? దీనివెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకోండి.

ఓ సారి పరిస్థితుల కారణం గా దేవేంద్రుడు, ఆయన భార్య శచీదేవి ఇద్దరు వెదురు చెట్లు గా మారి అడవిలో ఉండాల్సి వచ్చింది. కొన్నిరోజులు వారు ఉన్న ప్రాంతం లో అనావృష్టి సంభవించి అడవి ఎండిపోసాగింది. అయితే.. చెట్టు రూపం లో ఉన్న దేవేంద్రుడు.. తాను అక్కడ ఉండి ఏమి చేయలేకపోతున్నానని బాధపడసాగాడు. ఆ సమయం లో అటువైపు వచ్చిన నారదుడు దేవేంద్రుడిని గుర్తించి అతనిని ఎందుకు బాధపడుతున్నావని అడిగాడు.

తనకు ఆశ్రయమిచ్చిన అడవి అనావృష్టి కారణం గా ఎండిపోతుందని.. తాను ఉన్నా కూడా ఏమి చేయలేకపోతున్నానని తన బాధకు గల కారణాన్ని వివరించాడు. దానికి నారదుడు ఇలా బదులిచ్చాడు. పరమేశ్వరుని సమానుడైన అగస్త్య మహర్షి కైలాసం నుంచి కావేరి నదిని భువికి తీసుకొస్తున్నాడని.. ఆ జలాన్ని ఈ అడవి వైపు పారిస్తే కరువు ఉండదని నారదుడు సలహా ఇచ్చాడు. అయితే.. అగస్త్యుడంతటి వారిని నీటిని ఎలా వదలమని అడగాలి అంటూ దేవేంద్రుడు ప్రశ్నించాడు.

అప్పుడు నారదుడు గణపతిని ప్రార్ధించమని కోరతాడు. దేవేంద్రుడు భక్తి శ్రద్ధలతో గణపతిని తలుస్తూ తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు దేవేంద్రుడు తన మనసులోని మాటను చెబుతాడు. సంతసించిన విఘ్నేశ్వరుడు తప్పక ఆ కోరికను తీరుస్తానని వరమిస్తాడు. కైలాసం నుంచి భువికి వస్తున్నా అగస్త్యమహర్షి వద్దకు కాకిరూపం లో ఎదురెళ్తాడు. పరాకులో ఉన్న అగస్త్య మహర్షి కాకిని విదిలించాడు ప్రయత్నిస్తాడు.

ఆ కాకి తప్పించుకుంటుంది. తిరిగి మళ్ళీ వస్తుంది. కావేరి జలం ఉంచిన కమండలం పై వాలి.. ఆ కమండలాన్ని తన్నేసి ఎగిరిపోతుంది. ఆ కమండలం లో ఉన్న కావేరి జలం నదిలా పొంగి..అడవిలోకి ప్రవహిస్తుంది. కష్టపడి తీసుకొచ్చిన జలమంతా అడవిపాలు అవడం తో అగస్త్యుడు బాధపడతాడు. ఆ కాకిని పట్టుకుందామని చూస్తే.. ఆ కాకి మాయమైపోతుంది. కొంతసేపటికి ఓ బ్రహ్మచారి రూపం లో వినాయకుడు అగస్త్య మహర్షి వద్దకు వచ్చి ఆటపట్టిస్తాడు.

అయితే.. అగస్త్య మహర్షి వినాయకుడిని గుర్తించకుండా.. ఈ బ్రహ్మచారి కాకిరూపం లో వచ్చి కావేరి జలాన్ని అడవిపాలు చేసాడని భావించి ఆ బ్రహ్మచారిని పట్టుకోవాలని ప్రయత్నించి విఫలం అవుతాడు. కొంతసేపటికి అతడి కోసం చూస్తూ ఉన్న అగస్త్యునికి వినాయకుడు తన రూపాన్ని దర్శనం ఇస్తాడు. అప్పుడు అగస్త్యుడికి ఏమి జరిగిందో అర్ధం అవుతుంది. వెంటనే బాధపడి, తాను చేసింది అపరాధమేనని చెబుతూ మొట్టికాయలు వేసుకుంటాడు.

గణాధ్యక్షా.. నిన్ను గుర్తించలేకపోయినందుకు మన్నించు అంటూ మరిన్ని మొట్టికాయలు వేసుకుంటూ క్షమాపణ కోరుతాడు. అప్పుడు వినాయకుడు నవ్వుతు అగస్త్యుని వద్దకు వచ్చి.. అగస్త్యా.. మీరు నాకు తండ్రి సమానులు.. అని చెబుతూ.. తాను ఆ పనిని ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తాడు. తన తొండం తో కొంత కావేరి జలాన్ని అగస్త్యునికి ఇచ్చి.. ఇవి కూడా పవిత్రమైనవేనని.. నిక్షేపం గా జపం చేసుకోవచ్చని చెబుతాడు. ఎవరైతే.. ఇలా మొట్టికాయలు వేసుకుని గణపతిని పూజిస్తారో.. వారి పట్ల తన కరుణ కటాక్షం ఎక్కువ గా ఉంటుందని గణపతి అగస్త్యునికి వరమిస్తాడు. అప్పటినుంచి.. అగస్త్యుడిని తలుచుకుంటూ.. గణపతిని మొక్కేవారు అందరు మొట్టికాయలు వేసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.





























