ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర యోధుడన్న సంగతి మనందరికి తెలిసిందే. మొఘలుల పాలనను తరిమికొట్టి, స్వతంత్రత కోసం పోరాడిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. శివాజీ కి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైల పుణ్య క్షేత్రం తో ఎనలేని అనుబంధముందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. శ్రీశైల భ్రమరాంబికా దేవి ఛత్రపతి శివాజీ కి ఖడ్గాన్ని బహుకరించిందని చెబుతుంటారు. దీని వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1677 వ సంవత్సర కాలం నాటి సంగతి ఇది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కి, ఆరోజున గోల్కొండ సుల్తాన్ గా ఉన్న అబుల్ హసన్ కుతుబ్ షా కు సాన్నిహిత్యం ఉండేది. ఆ క్రమం లో ఛత్రపతి శివాజీ కూడా గోల్కొండ కోటకు రాకపోకలు సాగిస్తూ ఉండేవారు. ఈ సమయం లోనే ఓ సారి శివాజీ శ్రీశైలాన్ని కూడా దర్శించారట. సుల్తాన్ ఆస్థానం లో మంత్రులైన అక్కన్న, మాదన్న లు కూడా శివాజీ వెంట ఉండి దర్శనం చేయించి పర్యటన పూర్తయ్యే వరకు తోడు ఉండేవారట.
ఓ సారి ఛత్రపతి శివాజీ భ్రమరాంబిక ఆలయం వద్ద ఉన్న సమయం లో దేవిని చూస్తూ.. అక్కడే ఆత్మార్పణం చేసుకోవాలని భావించాడని చెబుతుంటారు. ఆ సమయం లోనే, ఆ దేవి ప్రత్యక్షమైందని, శివాజీ కి ఖడ్గాన్ని బహుమానం గా ఇచ్చిందని చెబుతుంటారు. ఈ ఖడ్గాన్ని ధరించమని, యుద్ధం లో వెనుతిరిగి చూడవని ఆ దేవి వరమిస్తుంది. నాటినుంచి, స్వతహాగా వీరుడైన ఛత్రపతి శివాజీ మరిన్ని విజయాలను అందుకున్నాడు. ఏ యుద్ధం చేసినా.. అందులో గెలుపు శివాజీదే అయ్యేది. శ్రీశైలం లో కూడా భ్రమరాంబిక దేవి శివాజీ కి ఖడ్గాన్ని బహుకరిస్తున్నట్లు ఓ విగ్రహం కూడా చెక్కబడి ఉంది.