జీవితమన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పవు. అయితే వాటిని ఓర్చుకుని ముందుకు సాగే మనోధైర్యాన్ని అలవర్చుకోవాలి. అందుకోసమే మోటివేషనల్ స్పీకర్స్ పని చేస్తూ ఉంటారు. వారి మాటలతో అందరిలో ఉత్తేజాన్ని నింపుతారు. వారి సంకల్ప బలాన్ని పెంచుతారు. అలాంటి మోటివేషనల్ స్పీకర్స్ తమ జీవితంలోని ఒడిదుడుకుల్ని తట్టుకోలేకపోతే..?
ఇటీవల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కాసాల జైపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎంతో మందికి తన ప్రసంగాల ద్వారా స్ఫూర్తినిచ్చారు.
జీవితంలోని ఒడిదుడుకులతో విసిగి వేసారిపోయిన వ్యక్తులకు తన మాటలతో ఉత్సాహాన్ని నింపారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ, ఆయన జీవితంలోని చీకట్లని ఎవరు ఆర్పలేకపోయారు. టీవీ 9 సమాచారం ప్రకారం, జైపాల్ రెడ్డి సోమవారం ఉదయమే నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి అందులోకి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. ఆయనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటిని భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామ నివాసి. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో మందికి తన రచనల ద్వారా స్ఫూర్తిని నింపిన ఆయన లేకపోవడం విషాదకరం. ఆయన ఇప్పటివరకు ఎనిమిదివేల పైగా సదస్సులు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆయన తన ప్రసంగాలను అందించేవారు. సమస్యలు ఎన్ని ఉన్నా.. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవితంలో ఇలా జరగడం బాధాకరం.