సోషల్ మీడియా లో నిత్యం బిజీ గా ఉండే ఓ భార్య భర్తని పట్టించుకోకపోవడం తో.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. స్టార్ ని అయిపోతా అంటూ కలలు కంటూ.. నిత్యం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లు, ఫేస్ బుక్ లో చాటింగ్ లతో సమయం గడిపేస్తున్న తన భార్యను మార్చుకోవాలని ఆ భర్త చాలా ప్రయత్నించాడు. ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకపోవడం తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

సమయం కధనం ప్రకారం, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఫతేనగర్ నివాసి పవన్ నీమ్కర్(34)కి ఆరు సంవత్సరాల క్రితం అనగా.. 2015 లో మౌలాలికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. పెళ్ళైన కొత్తలో వారి జీవితం సాఫీ గానే సాగిపోయింది. ఐతే.. పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు. దీనితో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు ప్రియాంక సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకుంది. నిత్యం వీడియోలు తీస్తూ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో బిజీ గా ఉండేది.

మరోవైపు పవన్ ఇవన్నీ తనకు ఇష్టం లేదు అని, పద్ధతి మార్చుకోవాలని కోరాడు. ఈ విషయం వలన కూడా వారి మధ్య మరింత ఎక్కువ గా గొడవలు జరిగేవి. ఇటీవల కరోనా కారణం గా పవన్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ క్రమం లో మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వడం తో ఆమెను మౌలాలి లోని పుట్టింట్లో దింపి.. తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ రోజు భార్యతో మరొకసారి గొడవ పడ్డాడని తెలుస్తోంది. ఓ వైపు భార్యతో గొడవ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన పవన్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన పవన్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించాడు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు ప్రియాంకే కారణమంటూ పవన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. మరో వైపు ప్రియాంక కూడా భర్త మరణం పై తనకు అనుమానాలున్నాయని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. మరో వైపు పవన్ బంధువులు ప్రియాంక పై పలు ఆరోపణలు చేస్తున్నారు. భర్త మాట వినేది కాదని, సోషల్ మీడియా లో వీడియోలు చేస్తూ ఉండేదని, చివరకు యాభై వేలు జీతం తెచ్చి ఇస్తే తప్ప పిల్లలను కనడం కుదరదని తమ ముందే చెప్పేది అని చెప్పుకొచ్చారు.


































