Ads
ఇంగ్లండ్ వేదికగా సోమవారం జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో 157 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 1971లో విజయాన్ని అందుకున్న టీమిండియా మళ్ళీ చాలా సంవత్సరాల విజయాన్ని నమోదు చేసుకుంది. భారత జట్టు ఇంగ్లాండ్ పై సిరీస్ లో ఒకటి కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ గెలవడం గత 35 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భారత్ విజయం సాధించడానికి వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలవడానికి ముఖ్యమైన కారణం శార్దూల్ ఠాకూర్. మొదటి ఇన్నింగ్స్ లో శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాటింగ్ తో దూసుకెళ్లారు. ఒక సమయంలో శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ కారణంగా 191 పరుగులు చేయగలిగింది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట శార్దుల్ ఠాకూర్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో కూడా మళ్లీ శార్దూల్ ఠాకూర్ (60 బంతుల్లో 72; 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేశారు. ఈ విధంగా ఇంగ్లాండ్ కి లక్ష్య ఛేదనకి భారీ టార్గెట్ ఇచ్చింది టీమిండియా.
#2 ఇంకొక కారణం ఏంటి అంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ. ఈసారి ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు విరాట్ కోహ్లీ. అంతే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్ లో, బౌలింగ్ లో మార్పులు చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు.
#3 మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (11) విఫలం అయినా కూడా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి జట్టును కాపాడారు. కీలక భాగస్వామ్యం నెలకొల్పి పరుగులు చేయడం జట్టు కలిసొచ్చింది అనే చెప్పాలి. రాహుల్ (46) తో కలిసి మొదటి వికెట్ కి 83 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత పూజారాతో కలిసి మరో ఒక విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోర్ చేసేందుకు కారణమయ్యారు.
#4 నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా తీసింది నాలుగు వికెట్లు అయినా కూడా మ్యాచ్ విషయంలో కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి. తన పదునైన యార్కర్లతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపించారు. ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన సమయంలో ఒలీ పోప్, జానీ బెయిర్స్టో లని అవుట్ చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఓపెనర్లను పరుగులు చేయనియ్యలేదు. మ్యాచ్ మొత్తం కూడా యార్కర్లను సంధించి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో మిగిలిన ప్లేయర్లకు వికెట్ తీసే అవకాశం దక్కింది.
#5 ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలవడానికి ఇంకొక ప్రధాన కారణం రెండో ఇన్నింగ్స్ లో జట్టు చేసిన అద్భుతమైన బ్యాటింగ్. ఓపెనర్ల నుంచి టెయిల్ ఎండర్ల వరకు అందరూ తమ సత్తా చూపించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా, చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ చేశారు. లోకేష్ రాహుల్ విలువైన రన్స్ చేశారు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ అర్థ శతకం చేయగా, బూమ్రా, ఉమేష్ కూడా పరుగులు చేశారు.
ఈ కారణంగానే భారత్ ఇంగ్లాండ్ కి భారీ టార్గెట్ ఇవ్వగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది.
End of Article