జ్ఞానానికి, ప్రశాంతతకు చిహ్నం గా బుద్ధుడి ని పిలుస్తుంటారు. బుద్ధుడు ప్రవచించిన ధర్మాలని పాటిస్తూ బౌద్ధం ఒక మతం గా కూడా వెలిసింది. మనం ఏ బుద్ధుడి విగ్రహాన్ని చూసినా ప్రసన్న వదనం తో కనులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. బుద్ధుడి విగ్రహాన్ని చూస్తేనే మనకి ఒకరకమైన ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది.
బుద్ధుడి విగ్రహానికి ఉన్న శక్తీ అలాంటిది మరి. అందుకే చాలా మంది బుద్ధుడి చిత్రపటాలను కానీ, చిన్నపాటి విగ్రహాలను కానీ తమ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మనం చాలా చోట్ల బుద్ధుడి విగ్రహాలను లేదంటే ఫొటోలనో చూస్తూనే ఉంటాం. అయితే… వాటిని తీక్షణం గా పరిశీలిస్తే.. మనకు ఓ విషయం అవగతమవుతుంది.
బుద్ధుడి తలపై రింగులు రింగులు గా ఉండడాన్ని ఎప్పుడన్నా గమనించారా..? అది జుట్టు అయ్యుండచ్చు లేదా కిరీటం అయ్యుండచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం కదా.. అంటే పప్పులో కాలేసినట్లే.. అది జుట్టో, కిరీటమో కాదు..దీని వెనుక ఓ కథ కూడా ఉంది.. బుద్ధుడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట. ఆయన గంటల తరబడి ధ్యానం లో మునిగిపోయి ఉన్నారు. బయట ఏమి జరుగుతోందో కూడా ఆయనకు పట్టడం లేదు. ఈ లోపు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నుంచి వచ్చే ఎండ మండిపోతోంది. ఈ సమయం లో ఓ నత్త ఆయనను గమనించింది. ఆయన ఎండ మండిపోతున్నా కూడా ధ్యానం లో మునిగిపోయి ఉన్నాడని గ్రహించింది.
ఇంకా ఇలానే కొనసాగితే.. ఎండ వేడి ఆయన మాడుకి తగిలి ధ్యానం చేయడం కష్టం అవుతుంది అని భావించింది. తాను ఆయన తలపై కూర్చుంటే.. తన శరీరం లో ఉండే తేమ వలన ఆయనకు ఎండ వేడి తగలకుండా ఉంటుందని భావించి.. ఆయన తలపైకి ఎక్కి కూర్చుంది. అలా.. ఆ నత్త వెనకే మరికొన్ని నత్తలు.. మొత్తం 108 నత్తలు ఆయన తలపైకి ఎక్కి కూర్చున్నాయట.. అయితే.. ఆ వేడి వలన నత్తలు తమ ప్రాణాలను కోల్పోయాయి. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగే వరకు అవి అలానే ఉన్నాయట. బుద్ధునికి జ్ఞానోదయం కలిగించడం కోసమే.. అవి ప్రాణాలు వదిలేసుకున్నాయని చెబుతారు.
మరో కథ కూడా ప్రచారం లో ఉంది. బుద్ధుని జుట్టు కర్లీ గా ఏమి ఉండదు. కానీ.. ఆయన గంటల తరబడి ఎండలో కూడా ధ్యానం చేయడం వలన ఆయన జుట్టు కొంత కాలిపోయి వంకర్లు తిరిగిపోయి ఉంటుందట. మనం గమనిస్తే.. చాలా వరకు ఉష్ణ దేశాల్లో ఉండే ప్రజలకు కూడా జుట్టు కర్లీ గానే ఉంటుంది. అందుకే ఈ కథ కూడా ప్రచారం లోకి వచ్చి ఉండవచ్చు.