Ads
సాధారణం గా అరవై సంవత్సరాలు నిండాయంటే.. వారు వృద్ధాప్య దశకు చేరుకున్నారని భావిస్తాం. ప్రభుత్వం కూడా వారికి రిటైర్మెంట్ ను ఇచ్చేస్తుంది. పిల్లల మధ్యే వారి తుది జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు చాలా మంది. అయితే.. హిందూ సంప్రదాయం ప్రకారం.. అరవై ఏళ్ళు నిండిన వ్యక్తి కి భార్య సమేతం గా షష్టి పూర్తి వేడుకను చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వేడుకను అరవై ఏళ్ళు నిండిన వారికే ఎందుకు చేస్తారు అన్న విషయాన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
చాల మందికి దీనికి చెప్పే కారణం ఏంటంటే.. తెలుగు సంవత్సరాలు అరవై వరకు ఉన్నాయి. ఒక మనిషి తన జీవిత కాలం లో ఈ అరవై సంవత్సరాలను చూసేసిన తరువాత షష్టి పూర్తి వేడుకను చేస్తారని అంటుంటారు. కానీ దీని వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ తెలుగు సంవత్సరాలు అరవై మాత్రమే ఎందుకు ఉన్నాయి అన్న విషయం కూడా ఈ కథ తెలుపుతుంది. ఓ సారి నారద మునింద్రుడు.. తనంతట గొప్ప వాడు లేడని భావిస్తూ ఉంటాడు.
ఆ సమయం లో అతనికి బుద్ధి చెప్పాలని భావించిన శ్రీ మహా విష్ణువు నారదుడి చుట్టూ మాయతో కప్పేస్తాడు. ఆ తరువాత ఓ సరస్సు లోకి తీసుకెళ్లి అందులో స్నానం చేయాలనీ చెప్పాడు. నారదుడు అలానే చేయగా.. సరస్సులోంచి బయటకు వస్తుండగా.. నారదుడు పూర్తి గా స్త్రీ గా మారిపోయాడు. ఆ సమయం లో అక్కడకు వచ్చిన ఓ మహారాజు.. స్త్రీ రూపం లో ఉన్న నారదుడిని చూసి మోహించి పెళ్లాడతాడు.
అలా.. వివాహమయ్యాక.. నారదుడు 60 మంది సంతానాన్ని కంటాడు. వారి పేర్లే.. ప్రస్తుతం తెలుగు సంవత్సరాదుల పేర్లయిన ప్రభవ, విభవ, శుక్ల,…. అక్షయ మొదలైనవి. అయితే.. వీరందరూ యుద్ధం లో మరణిస్తూ ఉంటారు. దీనితో నారదుడు పుత్ర శోకం తో మిగిలిపోతాడు. ఆ సమయం లో శ్రీ మహా విష్ణువు వచ్చి నారదుని చుట్టూ ఉన్న మాయను తొలగించి.. జ్ఞానోపదేశం చేస్తాడు. అతని సంతానం కాల చక్రం లో తిరుగుతూనే ఉంటుందని వరమిస్తాడు.
అప్పటి నుంచి.. నాలుగు యుగాల్లోను ఈ సంవత్సరాదులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కలియుగం లో మానవుని ఆయుర్దాయం 120 సంవత్సరాలకు పడిపోయింది. దీనితో.. మొదటి భాగమైన 60 ఏళ్ళు పూర్తి అయ్యాక షష్టి పూర్తి వేడుక చేస్తారు. మొదటి అరవై ఏళ్లను లోక సంబంధ విషయాలకు ఉపయోగించినా.. ఆ తరువాత అరవై ఏళ్లను ఆధ్యాత్మిక సంబంధ విషయాలకు ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఈ బాధ్యతను షష్టి పూర్తి వేడుక ద్వారా గుర్తు చేయడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశ్యం.
End of Article