గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే సంకల్పంతో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంగ్రామాన్ని ప్రారంభించారు వైయస్ జగన్. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఫైనల్స్ జరిగాయి. వైయస్ జగన్ యొక్క ఈ సంకల్పాన్ని గ్రామీణ యువకులు సద్వినియోగపరుచుకుంటున్నారు. తమలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.
అందుకు నిదర్శనమే ఈ విజయనగరం జిల్లాకు చెందిన కే పవన్ అనే యువకుడు. ఆడదాం ఆంధ్రాలో పాల్గొని ఐపీఎల్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిలో పడ్డాడు.గ్రామ, మండల, నియోజకవర్గం జిల్లా ఇలా వివిధ స్థాయిలలో అనేక క్రీడా పోటీలు నిర్వహించారు. అక్కడ చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫైనల్స్ కి ఎంపిక చేశారు. వివిధ క్రీడలలో 14 మంది ప్లేయర్లను ఏపీ ప్రభుత్వం దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
అలాగే మరికొన్ని సంస్థలు మరికొందరు ప్లేయర్లని దత్తత తీసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో చక్కని ప్రదర్శన చేసిన విజయనగరం జిల్లాకు చెందిన కే. పవన్ ను ఐపీఎల్ టీమ్స్ లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకుంది. ఫిబ్రవరి 13న వైజాగ్ ఏలూరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో పవన్ చక్కగా రాణించాడు. దీంతో పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే జట్టు అతడిని దత్తత తీసుకుంది.
పవన్ కి చిన్నప్పటి నుంచి ఈ క్రీడలు అంటే మక్కువ కానీ పేదరికం కారణంగా ఇంతకాలం తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రాలేదు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని పవన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. సీఎం జగన్ తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర లో పవన్ తో పాటు ఎంతో మంది యువత వెలుగులోకి వచ్చారు. అందులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణువర్ధని కూడా ఒకరు.