Ads
ఉన్నత చదువుల కోసమో, లేక ఉపాధి కోసమో చాలా మంది ఇండియన్లు అమెరికా బాట పడుతున్నారు. అక్కడ వారు ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా.. చదువుకోవడానికి అమెరికాకి వెళ్లిన తెలుగు విద్యార్థి దారుణంగా హత్యకి గురి అయ్యాడు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ అనే వ్యక్తి పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్లే ముందే అతనికి పెళ్లి అయింది. ప్రస్తుతం అతని భార్య నిండు గర్భవతిగా ఉంది.
అయితే చదువుకుంటూనే సత్య పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అమెరికాలోని అలాబామా రాష్ట్రం బిర్మింగ్హమ్లో ఓ స్టోర్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి, జీవితంలో స్థిరపడాలి అనే ఉద్దేశ్యంతో సత్య కృష్ణ గత నెలలోనే అప్పులు చేసి మరీ అమెరికాకి వచ్చాడు. పార్ట్ టైం ఉద్యోగం లో నిలదొక్కుకుంటూ చదువుకుంటున్నాడు. అంతలోనే దారుణం జరిగిపోయింది. ఫిబ్రవరి 11 వ తేదీన రోజులానే విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ దుండగుడు అక్రమంగా కాల్పులు జరిపాడు. గన్ లతో స్టోర్ లోకి ప్రవేశించిన ఈ దుండగుడు డబ్బులు ఇవ్వాలంటూ సత్య కృష్ణను బెదిరించాడు.
ఆతరువాత అకారణంగా సత్యకృష్ణపై కాల్పులకు పాల్పడ్డారు. నేరుగా బుల్లెట్లు శరీరంలోకి దిగడంతో సత్యకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేసారు. ఆరడుగుల పొడవు ఉన్న నిందితుడు నల్లటి కోట్ వేసుకుని, నల్లటి మాస్క్ తో ముఖాన్ని కప్పుకున్నాడు. అతని ఫోటోలను కూడా విడుదల చేసారు. నిందితుడి ఆచూకీ తెలపాలని, తెలిపిన వారికి 1000 డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
సత్యకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిండు గర్భిణీ అయిన అతని భార్యని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అయితే, ఆ యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి సాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరారు.
End of Article