Ads
టీ20 ప్రపంచకప్ 2022 నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. సెమిస్ లో పేలవ ప్రదర్శనతో రోహిత్ సేన పొట్టి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుంది. టైటిల్ తెస్తుందనుకున్న భారత్.. ఉట్టి చేతులతోనే స్వదేశానికి తిరుగు పయనమవ్వడం భారత అభిమానులను కలిచివేసింది.
Video Advertisement
ఈ నేపథ్యం లో భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో కొంతమంది కెరీర్కు రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉందని క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ వెల్లడించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. అయితే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేని భారత జట్టు మరో శ్రీలంక జట్టులా మారుతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, లసిత్ మలింగ, ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నే దిల్షాన్ వంటి స్టార్లు ఉన్నంతకాలం.. టాప్ టీమ్గా వెలుగొందింది శ్రీలంక. వీళ్లంతా రెండు మూడేళ్ల గ్యాప్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో లంక పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. ఇప్పుడు అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి..?? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్లు రిటైర్ అయే సమయానికి ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి యంగ్ ప్లేయర్లు.. మంచి అనుభవం సాధించి, మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకున్నారు… సీనియర్ల తర్వాత జట్టు భారాన్ని మోశారు. కానీ ఇప్పుడు కోహ్లీ, రోహిత్ రిటైర్ అయితే రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లు ఎక్కువ కాలం జట్టులో కొనసాగే అవకాశం కనిపించడం లేదు.
హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, భువీలకు మంచి అనుభవం ఉంది కానీ ఫిట్నెస్ మైంటైన్ చేయలేకపోతున్నారు. రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు ఉన్నా, వాళ్లు ఇంకా పూర్తిగా మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకోలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి ఫామ్ లోనే ఉన్నా వయసు కూడా 30 దాటేసింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ముందే తమ ప్లేస్ని భర్తీ చేయగల మ్యాచ్ విన్నర్లను గుర్తించి, తయారుచేసి… టీమ్కి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నారు అభిమానులు. లేదంటే శ్రీలంక జట్టు పరిస్థిలో టీమిండియా ని చూడలేమని కామెంట్లు చేస్తున్నారు.
End of Article