తమిళ్ స్టార్ విజయ్ కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. తెలుగులో విజయ్ సినిమాలు చేయకపోయినా కూడా చాలా గుర్తింపు ఉన్న హీరో అయ్యారు. ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదల అవుతోంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఎంతో మంది పెద్ద నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. అయితే ఈ ట్రైలర్ కి మాత్రం రెస్పాన్స్ అనుకున్న విధంగా రావట్లేదు అనే చెప్పాలి. అంతకుముందు సినిమా పోస్టర్స్ చూసి మహర్షి సినిమా గుర్తొస్తోంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మహర్షి సినిమా మాత్రమే కాదు. ఇంకా చాలా తెలుగు సినిమాలు గుర్తొస్తున్నాయి అంటున్నారు. అసలు ట్రైలర్ లోనే చాలా కథ అర్థం అయిపోతుంది అని అంటున్నారు.
ఇప్పుడు ఈ ట్రైలర్ మీమర్స్ కి మంచి కంటెంట్ అయింది. ఇప్పటివరకు ‘వారసుడు’ సినిమా మీద ఉన్న కాస్త బజ్ ను కూడా ఈ ట్రైలర్ తీసేసిందనే చెప్పాలి. ట్రైలర్ చూసిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయనిపించడం ఖాయం. ఉమ్మడి కుటుంబం, సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో ఒక సమస్య రావడం, హీరో తండ్రి వ్యాపారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించే స్టైలిష్ విలన్.. వీటన్నింటికీ చెక్ పెట్టి మళ్లీ తన ఫ్యామిలీని ఒక్కటిగా చేసే హీరో.
దాదాపు ఇదే కథతో ఇప్పటికే మన స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సినిమాలు చేసేశారు. ట్రైలర్ లో అయితే ‘బ్రహ్మోత్సవం’, ‘అత్తారింటికి దారేది’, ‘మహర్షి’ సినిమాల ఛాయలు కనిపిస్తున్నారు. ఈ కథ కోసం దిల్ రాజు వందల కోట్లు ఖర్చు చేశారు. సినిమా ప్రమోషన్స్ లో ఎంతో గొప్పగా మాట్లాడారు. విజయ్ లాంటి స్టార్ హీరో కోసం వంశి పైడిపల్లి ఇలాంటి కథని రాశారా అని ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్లు. సంక్రాంతికి వస్తామని చెప్పి సంక్రాతి సినిమాతో వస్తున్నారేంటిరా అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.