ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం మోగింది. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 13 వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇకపోతే ఇప్పటికే తెలుగుదేశం బిజెపి జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి తరుణంలో అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఇడుపులపాయలు ఒకేసారి 175 మంది ఎమ్మెల్యేలు అలాగే 25 ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇలా అభ్యర్థుల ప్రకటన కూడా ఖరారు కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఇక ఈ ఎన్నికలలో అందరి చూపు మూడు నియోజకవర్గాల పైనే ఉంది. టిడిపి జనసేన నుంచి పోటీ చేయబోతున్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలయ్య ఈ ముగ్గురి నియోజకవర్గాలపై అందరు చూపు ఉంది.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి కూడా అక్కడే నిలబడి గెలుపు సాధించాలని కృషితో లోకేష్ ముందడుగు వేస్తున్నారు. అయితే లోకేష్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మురుగుడు లావణ్య ఎన్నికల బరిలోకి దిగారు. ఈమె రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళ. మరి వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే జనసేన అధినేతగా గత ఎన్నికలలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా గెలుపు సాధించలేక ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా ఈయన పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. పీఠాపురంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడే తన గెలుపు సాధ్యమని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా ఓడించే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు ఈ క్రమంలోనే కాపు మహిళా నేతగా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి వంగ గీతను బరిలోకి దింపారు. దీంతో ఈ నియోజకవర్గపై కూడా ఎంతో ఆసక్తి నెలకొంది.
ఇక చంద్రబాబు బావమరిది, లోకేష్ మామయ్య, సినీ నటుడు బాలయ్య గత రెండు ఎన్నికలలో కూడా హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్నికలలో కూడా ఈయన హిందూపురం నుంచి పోటీ చేయబోతున్నారు అయితే ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి బిసి మహిళా దీపికాను జగన్ రంగంలోకి దింపారు. ఈమె భర్త వేణుగోపాల్ రెడ్డి. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఈమె కురుపు మహిళ ఇలా రెండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో జగన్ ఈమెను రంగంలోకి దింపారు.
ఇలా ఈ ముగ్గురికి పోటీగా మహిళలను నిలబెట్టి మహిళల చేతిలో వారు ఓడిపోయేలా జగన్ వేరే లెవెల్ పాలిటిక్స్ చేస్తూ రంగంలోకి దింపారని తెలుస్తుంది మరి ఈ ఎన్నికలలో ఎవరు విజయకేతనం ఎగరవేస్తారు అనేది తెలియాల్సి ఉంది.